CM KCR | నాగర్కర్నూల్ : తెలంగాణ మోడల్ మాకు కావాలని దేశమంతా కోరుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. అనేక సభల్లో దేశ రమ్మంటుంది.. పోవాల్నా అంటే పో బిడ్డా మేం ఆశీర్వదిస్తాం అని మీరంతా చెప్పారు. తెలంగాణ ప్రజలే నా బలగం.. నా బంధువులు మీ ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చిమ్మ చీకటి అయితదని నాడు ఆంధ్రా నాయకులు శాపం పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. ఇవాళ తెలంగాణ వెలుగుజిలుగులతో మెరిసిపోతోంది. ఆంధ్రా చిమ్మచీకట్లో ఉంది. దేశంలో ఎక్కడా కూడా ఇంత మంచిగా కరెంట్ లేదు. గిరిజనులకు పోడు భూములు పంచుకుంటుంన్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండపూర్ రిజర్వాయర్లు నిండాయంటే పాలమూరు బంగారు తునక అవుతుంది. బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు. వీటిని పూర్తి చేసి పాలమూరుకు వంద శాతం నీళ్లు ఇస్తాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్లీ ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను. ధరణి పోర్టల్ ఉండాల్నా..? తీసేద్దామా..? ధరణిని తప్పకుండా ఉంచుదాం. ఎవడైతే బంగాళాఖాతంలో వేద్దాం అన్నాడో వాన్నే బంగాళాఖాతంలో వేద్దాం. ముందుకు పోదాం. ధరణిలో సమస్యలు ఉంటే అధికారులకు, ఎమ్మెల్యేలకు చెప్పండి. మంత్రులకు చెప్పండి.. నిమిషాల మీద పరిష్కారం చేస్తారు అని కేసీఆర్ సూచించారు.
గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు. మహబూబ్నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ సాధించాను కాబట్టి.. అన్ని నియోజకవర్గాలకు 4 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నాం. వృత్తిపని వారు ఉన్నారు. బీసీ కులాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి కుటుంబానికి లక్ష సాయం చేస్తున్నాం. బీసీ కులాల్లో పేదలైన వారికి ఇది ఎంతో ఉపయోగం. ఈ నెల 9 నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ విధంగా మానవీయ పాలన కొనసాగిస్తున్నాం. కులం లేదు జాతి లేదు. అందరూ మనవాళ్లే. అందరూ చల్లగా బతకాలి. ఈ పథకాల గురించి ఒక్కడైనా ఆలోచించారా? కంటి వెలుగు కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి ఉచితంగా అద్దాలు ఇస్తున్నాం. ఒంటరి మహిళలు ఉన్నారు.. వారి గురించి ఎవరైనా ఆలోచించారా..? బీడీ కార్మికులకు ఒక్కడైనా రూపాయి ఇచ్చారా..? ఇవన్నీ కూడా చాలా మేదోమథనం నుంచి వచ్చాయి. అద్భుతమైన మానవీయ కోణంలో పని చేస్తున్నాం. ఇది రైతులు, గిరిజనులు, దళితుల ప్రభుత్వం అని కేసీఆర్ స్పష్టం చేశారు.