CM KCR | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమైందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ఐపాస్ చట్టానికి తోడు 24 గంటలు విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలన పరిశ్రమలకు వరంగా మారాయన్నారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఇప్పుడు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలు, పవర్ హాలీడేస్, నీటి కొరత కారణంగా అనేక పరిశ్రమలు మూత పడ్డాయి. పారిశ్రామిక వేత్తలు దిక్కుతోచని స్థితిలో విలవిలలాడారు. పరిశ్రమల మూతతో నిరుద్యోగం తాండవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఈ సమస్యలన్నింటికీ సమూల పరిష్కారం లభించింది.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. టీఎస్ఐపాస్ వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంతో ఉత్సాహంతో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతోపాటు, సత్వరం అనుమతులూ, ఎక్కడా అవినీతికి చోటులేక పోవడం పారిశ్రామిక వేత్తలకు ఆనందం కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి రూ. 2,64,956 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయని.. 17.77 లక్షల మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు..
ఐటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఐటీ వార్షిక ఎగుమతుల విలువ రూ. 57,258 కోట్ల నుంచి రూ. 1,83,569 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. అంటే స్వరాష్ట్రంలో 220 శాతం వృద్ధిరేటు నమోదైందని వివరించారు. ఐటీ ఉద్యోగాల నియామకాలలో కూడా 156 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. 2014 నాటికి తెలంగాణలో కేవలం 3,23,396 మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 8,27,124కి పెరిగిందని తెలిపారు.
ఐటీ రంగాన్ని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్ధిపేటలో కూడా ఐటీ టవర్లను నిర్మించుకున్నాం. ఎస్.సి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర అవతరణ అనంతరం 1400 కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా అందించాం. రాష్ట్రంలో ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి కూడా తగిన ప్రాధాన్యతనిస్తున్నాం. సిర్పూర్ పేపర్ మిల్స్ వంటి పలు యూనిట్లను పునరుద్ధరించాం.’ అని పేర్కొన్నారు.
రాష్ట్ర అవతరణ తరువాత హైదరాబాద్ మహానగరం పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మార్మోగిపోతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా నిలుస్తోందని తెలిపారు. ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. అనేక అంతర్జాతీయ సదస్సులకు మనకు ఆహ్వానాలు అందుతున్నాయని.. గతంలో వచ్చిన దిగ్గజ సంస్థలే కాకుండా ఇంగ్లాండ్, అమెరికా నుంచి కూడా అనేక సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు కూడా చేసుకున్నాయని తెలిపారు. ఇదీ తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని.. ఇదీ మన రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయంగా సాధించిన ఖ్యాతి అని తెలిపారు. ఇది తెలంగాణపై ఇతర దేశాలకు ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వెల్లడిస్తున్నదని అన్నారు.
వినూత్న ఆవిష్కరణలతో ముందుకొచ్చే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ , రీచ్ సంస్థలు దోహదపడుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వినూత్న స్టార్టప్ ల ఆవిష్కరణలతో టీ-హబ్ దేశంలోనే రికార్డు సృష్టించిందని అన్నారు. అందుకే టీ-హబ్-2 ను కూడా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. 2022లో భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ స్టార్టప్ అవార్డులలో మన టీ-హబ్ ఉత్తమ ఇంక్యుబేటర్గా నిలిచిందని తెలిపారు.ఽ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి