హైదరాబాద్: గోల్కొండ వేదికగా నేతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నామని.. దీనిద్వారా గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామని సీఎం అన్నారు. ఇప్పటికే నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని చెప్పారు. నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీని అందిస్తూ నేతన్నకు చేయూతనిస్తున్నదని వెల్లడించారు. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా రూ.5 లక్షల బీమాను కల్పిస్తున్నదని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను వాసిలోనూ, రాశిలోనూ పెంచిందని చెప్పారు. అసహాయులకు జీవన భద్రతకోసం అందించే పెన్షన్ను రూ.200 నుంచి రూ.2,016కు పెంచిందన్నారు. 2014 నాటికి ఆసరా లబ్ధిదారుల సంఖ్య కేవలం 29 లక్షలని, నేడు వారి సంఖ్య 44 లక్షలకు పెరిగిందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతోపాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ సౌకర్యం కల్గించిందని చెప్పారు. పెన్షన్ పొందేందుకు వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించిందని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల పెన్షన్ను రూ.3016 నుంచి రూ.4016 రూపాయలకు పెంచిందని, తద్వారా దివ్యాంగుల బతుకుల్లో మరింత ధీమాను నింపిందని వెల్లడించారు.
ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపల పెంపకం వంటి చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. గీత కార్మికులకు ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు చేసిందని, పాత బకాయిలు మాఫీ చేసిందని తెలిపారు. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నదని వెల్లడించారు. రైతు బీమా తరహాలో గీతన్నలకు సైతం పైసా భారం లేకుండా రూ.5 లక్షల బీమా కల్పించిందని చెప్పారు.