హైదరాబాద్ : మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు. ఇట్ల రకరకాలుగా విభజనలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఈ రోజు బంజారాహిల్స్లో ఇంత చక్కటి బంజారా భవన్ నిర్మాణం చేసుకోని నాచేతులుతో ప్రారంభింపజేసుకున్నందుకు మంత్రి సత్యవతి రాథోడ్కు, బంజారా ప్రజాప్రతినిధులకు, యావత్ తెలంగాణ రాష్ట్ర బంజారా బిడ్డలందరికీ హృదయపూర్వకంగా, సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ వస్తే ఏం జరుగుతదనే మాట ఉద్యమ సందర్భంలో చాలా చోట్ల చెప్తూ వచ్చాను. అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. మన రాజధాని నగరంలో బంజారాహిల్స్ అనే గొప్ప ప్రాంతం ఉంటది. కానీ బంజారాలకే గజం జాగ లేదని చెప్పాను. ఆ మాట తారుమారు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా భవనం నిర్మించుకున్నాం. మనం ఈ రోజు ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట పట్టాయి. అన్ని చోట్ల గిరిజన బిడ్డలకు గౌరవం లభించే విధంగా దశ దిశ చూపిస్తుందని భావిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎంతో మంది బంజారా బిడ్డలు ఉత్తమమైన సేవలు అందిస్తున్నారు. అనేక రంగాల్లో అనేక హోదాల్లో పని చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని నీటి పారుదల శాఖలో మన బంజారా బిడ్డ హరే రామ్ అందించే సేవలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అలా అనేక రంగాల్లో అనేక మంది అధికారులు ఉన్నత స్థాయిల్లో పని చేస్తున్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒక్కటే. సమస్యలు మనకు చాలా ఉన్నాయి. ఈ భవనం కట్టుకొని సంతోషపడితే అయిపోదు. బంజారా జాతికున్న ఒక విశిష్టత, గొప్పతనం ఏంటంటే రకరకాల వారికి రకరకాల భాషలుంటాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉండే బంజారా బిడ్డలకు, మన దేశంలో ఏ రాష్ట్రంలోకి పోయినా కూడా భాష మాత్రం లంబాడా భాష ఒక్కటే ఒక్కటి ఉంది. దాదాపు 28 నుంచి 30 దేశాల్లో మాట్లాడే భాష కూడా మన తెలంగాణ, మన తండాల్లో మాట్లాడిన భాషనే అక్కడ మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార్యం, ప్రత్యేకమైన జీవన విధానం, ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన పద్ధతుల్లో జీవించే ఆత్మగౌరవం, విశిష్ఠమైన సంస్కృతిని ఆ పరంపరను ఈ రోజు వరకు కూడా మన బంజారా బిడ్డలు కాపాడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసుకోబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. బంజారా ప్రజాప్రతినిధులంతా యాక్టివ్గా ఉండి.. పోడు భూముల పరిష్కారంలో చొరవ తీసుకోవాలి. మన బిడ్డలకు న్యాయం జరిగేలా చూడాలని మీ అందర్నీ కోరుతున్నాను. అడవులు, తండాల్లో ఉన్న మన బిడ్డలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు వెళ్తున్నారు. వారి బతుకులను బాగు చేసేందుకు ఈ రాష్ట్రంలో జరగాల్సిన చర్చలు ఈ భవనం నుంచి జరగాలని కోరతున్నాను. ఏదో తమాషాకు పెళ్లిళ్లు చేసుకోవడానికో, ఇంకోటి చేసుకోవడానికో కట్టిన హాల్స్ కాదు. ఇంత మంచి హాల్లో చక్కటి సమావేశాలు జరగాలి. ఏ జిల్లాలో, ఏ తాలుకాలో, ఏ తండాలో ఏ సమస్యలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా రూపుమాపాలి. ఏ విధంగా ప్రభుత్వం సేవలు తీసుకోవాలి. ఇక్కడ ఒక కమిటీలాగా పెట్టి ఎక్కడ ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా ఇక్కడ్నుంచి గద్దల్లా పోయి వారికి రక్షణగా ఉన్నప్పుడే ఈ భవనానికి సార్థకత లభిస్తుంది. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.