CM KCR | కాగజ్నగర్ : గతంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు, ఆ రైతులకు ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా..? భూమి ఉందా? అని అడిగి పిల్లను ఇస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కాగజ్నగర్ ఎట్ల ఉండేనో.. తెలంగాణ అట్లనే ఉండే. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, పరిశ్రమలు మూతపడటం రకరకాల ఇబ్బంది చూశాం. పొట్ట చేతపట్టుకుని వలసలు పోయారు. ఈ పదేండ్లలో ఒకటి ఒకటి బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మంచినీళ్ల సమస్య లేదు. సిర్పూర్ గురించి మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లంబాడీ, ఆదివాసీ గూడెంలకు భగీరథ నీళ్లు వస్తున్నాయి. కరెంట్ బాధ కూడా లేదు. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. అన్ని వర్గాలకు కరెంట్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇలా సమస్యలు పరిష్కరించుకున్నాం. పేదలకు మంచి చేసుకున్నాం. ఆరోగ్యం దృష్ట్యా కూడా మంచి పనులు చేపట్టాం. గవర్నమెంట్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు అవుతున్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ తగ్గింది అని కేసీఆర్ తెలిపారు.
విద్యా వ్యవస్థను బాగు చేసుకున్నాం. గురుకుల విద్యాసంస్థలు నెలకొల్పాం. కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం గురుకులాలు పెట్టుకున్నాం. ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల మీద లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నాం. గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లు ,ఇంజినీర్లుగా తయారవుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అంటేనే వలస పోవుడు. ఇవాళ రైతాంగం బాగుపడాలని, వ్యవసాయాన్ని స్థీరికరించాలని చాలా మంచి పనులు చేశాం. నాలుగైదు సౌకర్యాలు కల్పించాం. గతంలో రైతుకు పిల్లను ఇవ్వకపోయేటోడు. చివరకు చప్రాసీ ఉద్యోగం ఉన్నవారికి ఇచ్చేవారు. ఇవాళ రైతుకు పిల్లను ఇస్తున్నారు. భూమి ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే వ్యవసాయం విలువ భూమి విలువ పెరిగింది. నీటి తీరువా లేదు. ప్రాజెక్టుల ద్వారా ఇచ్చే నీళ్లకు ట్యాక్స్ లేదు. బకాయిలు రద్దు చేసుకున్నాం. రైతులు దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దని రైతుబంధు ఇస్తున్నాం. ఈ పథకం పేద రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అని సీఎం స్పష్టం చేశారు.
వడ్లు పండితే ఏ ఊరికి ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నాం. దళారీ రాజ్యం ఉండొద్దని చెప్పి ధరణి పోర్టల్ తెచ్చి రైతుల భూములను రక్షించాం. ఈ నియోజకవర్గంలో 16 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. గిరిజనులపై ఉన్న కేసులు ఎత్తేశాం. రైతుబంధు ఇచ్చాం. గిరిజనేతర బిడ్డలకు కూడా పట్టాలు వస్తాయి. దానికి ఆటంకం కేంద్ర ప్రభుత్వమే. కఠినమైన రూల్స్ పెట్టారు. లెక్కలు తీసి కేంద్రానికి పంపించాం. ఎన్నికల తర్వాత పోరాటం చేసి గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మొత్తానికి ఇవాళ రైతుల ముఖాలు తెల్లపడ్దాయి. అప్పులు లేవు. రైతులు సంతోషంగా ఉన్నారు అని కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కేసీఆర్కు పని లేక ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులను రైతుబంధు పెట్టి దుబారా చేస్తున్నారాని అంటున్నారు. నాకు దమాక్ ఖరాబ్ అయిందంట. వారికి దమాక్ పెద్దగా ఉందంట.. వాళ్లు చెప్పుతున్నారు రైతుబంధు దుబారా అని.. రైతుబంధు వల్ల లాభం ఉందా..? నష్టం ఉందా..? మీరే నిర్ణయం చేయాలి. 24 గంటల కరెంట్ అక్కర్లేదు మూడు గంటల కరెంట్ సరిపోతదని రేవంత్ రెడ్డి అంటున్నడు. అది కూడా దుబారా అని మాట్లాడుతున్నారు. వాళ్లు ఇవ్వలేదు. ఇచ్చేటోళ్ల మీద నిందలు వేయడం. కరెంట్ షాకులతో పురుగుబూసి కరిచి చనిపోవడం ఇలా పడరాని పాట్లు పడ్డాం. బావుల కాడనే కరెంట్ కావలి ఉండేటోళ్లు అని కేసీఆర్ గుర్తు చేశారు.
రైతుల భూములపై ఇంతకు ముందు అధికారం అధికారులకు ఉండే. ఒకరి భూమికి మరొకకరి రాసి తాకట్లు పెట్టేవారు. ఈ బాధ శాశ్వతంగా పోవాలని చెప్పి నేను ధరణి పోర్టల్ తెచ్చాను. ధరణి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదు. ఎవరి భూమి వారికి సురక్షితంగా ఉంది. పావు గంటలో రిజిస్ట్రేషన్, పావు గంటలో పట్టా అయిపోతుంది. భూముల రిజిస్ట్రేషన్ కోసం మునుపు లంచం వసూళ్లు చేసి నెలలు తిప్పేటోళ్లు. మా దగ్గర ఉన్న అధికారాన్ని, పెత్తనాన్ని తీసేసి, మీ బొటనవేలికి అధికారం ఇచ్చాం. మీ బొటనవేలితోనే మీ భూమి హక్కు మారుతది. దరఖాస్తు లేకుండానే నేరుగా ఖాతాలో రైతుబంధు డబ్బులు పడుతున్నాయి. రైతుబంధు డబ్బులను ఎరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు రావు. మళ్లీ దళారీలు వస్తరు. మళ్లా లంచాలు మొదలవుతాయి. ధరణిని బంగాళాఖాతంలో వేస్తారట ఇది చాలా ప్రమాదం. అప్పుడు దళారి, పైరవీకారుల రాజ్యం వస్తది. రైతులు ఆగమవుతారు అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.