టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని వెల్లడించారు. టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. టీ హబ్-2 ప్రాంగణాన్ని పరిశీలించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. యూనికార్న్ వ్యవస్థాపకులు, ప్రముఖ అంకుర సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించారు. సీఎం కేసీఆర్తో అంకుర సంస్థ ప్రతినిధులు సెల్ఫీలు దిగారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, టీ హబ్ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల కిందే అంకురార్పణ జరిగిందన్నారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలని టీ హబ్ ప్రారంభించినట్లు చెప్పారు. 2015లో మొదటి దశ టీ హబ్ను ప్రారంభించామని వెల్లడించారు. ఏడేళ్ల తర్వాత టీ హబ్ రెండో దశ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఏడేళల్లో టీహబ్ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించినట్లు చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. టీ హబ్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు అధికారులను అభినందించారు.
స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్
దేశవ్యాప్తంగా అనేక స్టార్టప్ కంపెనీలకు టీ హబ్ ఊతమిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ను స్టార్టప్ క్యాపిటల్గా రూపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో హైదరాబాద్ ఉత్తమ నగరమని తెలిపారు. తెలంగాణ.. స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉండబోతుందన్నారు. యువ వ్యాపారవేత్తలను తయారుచేయడమే టీ హబ్ లక్ష్యమని వెల్లడించారు. స్టార్టప్లకు ప్రభుత్వమే ప్రోత్సహించడం తెలంగాణలోనే ప్రారంభమైందన్నారు. స్టార్టప్ల ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయన్నారు. టీ హబ్లో ఇప్పటికే చాలా కంపెనీలు తమ ప్రొడక్టులను ప్రారంభించాయని పేర్కొన్నారు. సక్సెఫుల్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.