CM KCR | నిజామాబాద్ : రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం. త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితికి పోతున్నాం. పెట్టుబడులు పెరిగాయి, రాష్ట్ర ఆదాయం పెరిగింది. తెలంగాణ వచ్చిన నాడు మన ర్యాంకు ఇండియాలో 19 ఉండే. ఇవాళ 3 లక్షల 18 వేలతో తసలరి ఆదాయంలో ఇండియాలో నంబర్ వన్గా ఉన్నాం. ఈ పదేండ్ల కష్లంతో అక్కడి దాకా వచ్చాం అని కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మన వద్ద నీటి తిరువా రద్దు చేశాం. ఏడాదిన్నర లోపే కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. 24 గంటల కరెంట్ రైతాంగానికి ఫ్రీగా ఇస్తున్నాం. రైతుబంధు అనే పథకం గురించి జమానాలో వినలేదు. గత గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదు.. ఆలోచించలేదు. మొట్టమొదటిసారి రైతుబంధును పుట్టించిందే కేసీఆర్. ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందుతుంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొంటున్నాం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే వారంలోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం. వీటితో రైతుల ముఖాలు తెల్లవడుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.
రైతుబంధు దుబారానో లాభమో రైతులు తేల్చాలి. మూడు గంటల కరెంట్ సరిపోతదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి. రైతులందరూ 10 హెచ్పీ మోటార్ పెట్టుకోవాలని రేవంత్ అంటున్నారు. 3, 5 హెచ్పీ మోటారు ఉంటది రైతుల వద్ద. ఇప్పుడు 10 హెచ్పీ మోటార్ ఎవడు కొనియ్యాలా..? వాడి అయ్యా కొనియ్యాల్నా.. యాడికెళ్లి రావాలి. మన వద్ద 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఆలోచించాలి. కరెంట్ బిల్లు ఏంది.. ఎన్ని అవస్థలు.. ఎన్ని లంచాలు గతంలో. ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలడం లేదు. ఏ బాధ లేదు. మంచిగా రైతు పండించుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయి. ఈ పద్ధతి పోవాలని అంటున్నారు కాంగ్రెసోళ్లు. వారు చాటుకు చెప్తలేరు.. టీవీ ఇంటర్వ్యూల్లో భాజప్తా చెబుతున్నారు. వీటి గురించి ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.