CM KCR | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎన్నికల వేళ మోసగాళ్లు వస్తున్నారని.. జర పదిలంగా ఉండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు. వాళ్ల మాటలు నమ్మితే గోసపడతామని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. బుధవారం మెదక్లో నిర్వహించిన ప్రగతి శంఖారావ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ధరణిని తీసేస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయని, పోర్టల్ను తీసేస్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు రైతుల పరిస్థితి తయారవుతుందని హెచ్చరించారు. భూములపై అధికారాన్ని ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా రైతుల చేతికి ఇచ్చిందని గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్తోపాటు రైతుబంధు, రైతుబీమా, పంటకొనుగోళ్లు వంటివన్నీ ధరణి రికార్డుల ఆధారంగానే పారదర్శకంగా జరుగుతున్నాయని వెల్లడించారు. పోర్టల్ను తీసేస్తే మళ్లీ పైరవీకారులు, లంచాల రాజ్యం వస్తుందని వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. అసమర్థులకు అధికారం ఇచ్చి ఈ సదుపాయాలను, గౌరవాన్ని పోగొట్టుకోవద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మొద్దని, మరోసారి బీఆర్ఎస్కే అధికారం అప్పగించాలని విన్నవించారు. సభలో సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఎమ్మెల్యే పద్మ నా బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో మొదటిరోజు నుంచి నాతోపాటు ఉన్నది. ఆనాడు తెలంగాణ వస్తదో రాదో తెల్వదు. రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెల్వదు. అయినా ఉద్యమంలో కొనసాగింది. కార్యకర్త నుంచి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా అనేక మంచి పనులు చేస్తూ మీ మధ్యే ఉన్నది. ఆమె అడిగిందంటే ఏదైనా కాదనకుండా ఇస్తానని గత ఎన్నికల సమయంలో మెదక్కు వచ్చినప్పుడు చెప్పాను. నా మాటను గౌరవించి, దీవించి పద్మను మంచి మెజార్టీతో గెలిపించారు. దాని ఫలితమే మెదక్లో ఇంద్రభవనం లాంటి కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్. మెదక్లో మంచి నాయకురాలు ఉన్నది కాబట్టే చాలామంచి పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హామీలే తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. మెదక్ పట్టణాన్ని జిల్లా చేయడమే ఉదాహరణ. కాబట్టి మీ అందరితో నా రిక్వెస్ట్ ఒక్కటే.. పద్మా దేవేందర్రెడ్డి పనితనాన్ని గుర్తించి మరొక్కసారి ఆమెకే టికెట్ ఇ చ్చినం. మీ అందరూ నిండు మనసుతోని దీవించి, ఆశీర్వదించి పద్మని గతంకంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించాలె. మీరు కోరిన పనులన్నీ చేసే బాధ్యత నాది. మెదక్ నియోజకవర్గాన్ని, మెదక్ పట్టణాన్ని బ్రహ్మాండంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మంత్రి హరీశ్రావుకు అప్పజెప్తున్నా. సిద్దిపేట ఏ విధంగా ఉన్నదో, ఆ విధంగా మెదక్ కూడా తయారుకావాలె. అన్నిరకాల కృషి జరగాలని కోరుకుంటున్నా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
పదేండ్ల కిందట తెలంగాణ ఎట్లుండే! వ్యవసాయం ఏముండే, కరెంటు సదుపాయం ఎట్లుండే, ఆనాడు ఎన్ని బాధలు అనుభవించినం. ఈనాడు ఎంత అద్భుతంగా ఉన్నం! ఏ విధంగా పారదర్శకంగా ఉన్నాం. ఇవన్నీ గమనించండి. దేశానికే తలమానికంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. అనేక రాష్ర్టాల్లో రైతులు, పేద ప్రజలు తెలంగాణ పథకాలు మాకు కూడా కావాలి అని అడుగుతున్నరు. ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నరు. ఈ మధ్య నేను మహారాష్ట్రకు పోతే అక్కడున్న రైతులంతా.. తెలంగాణలో వీఆర్వోలను తీసేసినట్టు మా దగ్గర కూడా తీసేయాలి అన్నరు. తెలంగాణ రైతులు బీఆర్ఎస్ను గెలిపించినట్టే మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ను గెలిపిస్తం, తెలంగాణ రైతుకందే సదుపాయాలు మాకు కూడా అందాలని అడుగుతున్నరు. నేను పోతే మహారాష్ట్ర రైతులు బ్రహ్మరథం పడుతున్నరు. ఈ స్థితిని మనం కాపాడుకోవాలె. రాష్ర్టాన్ని ఇంకా బాగా పురోగమింపజేయాలె. ఇంకా ధనికరాష్ట్రంగా ఎదగాలె. పేదలందరినీ ఆదుకోవాలె. మోసకారుల మాటలు నమ్మితే మనం గోసపడతం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలె. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించాలి.
ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ వాళ్లు చెప్తున్నరు. ఎందుకు తీసేస్తరు? ఏం తప్పు చేసింది? గతంలో రైతు భూము ల మీద అనేక మంది పెత్తనం ఉండేది. వీఆర్వో, గిర్దావర్, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి.. ఇలా ఎంతో మందికి పెత్తనం ఉండేది. ఇప్పుడు ఆ అధికారాన్ని ధరణి పోర్టల్ రూపంలో రైతులకు ఇచ్చి నం. మీ భూమికి యజమాని మారాలంటే మీ బొటనవేలుతోనే సాధ్యం. ఇంకెవరూ మార్చే ప్రసక్తే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎస్కు కూడా సాధ్యం కాదు. ఈ అధికారం రైతుల దగ్గరే ఉండాలా? మళ్లీ అధికారులకు అప్పజెప్పాలా? అనేది ప్రజలు ఆలోచించాలి. ధరణి పోర్టల్ పోతే దఫ్తర్ కోసం, దరఖాస్తు కోసం అధికారుల దగ్గరికి పోవాలె, లంచం ఇయ్యాలె.
కాంగ్రెస్ హయాంలో రైతు చనిపోతే ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు ఇచ్చేవారు. అవి కూడా ఏ ఒక్కరికీ పూర్తిగా రాలేదు. ఆరేడు నెలలు చెప్పులు అరిగేలా తిరిగితే రూ.20-30 వేలు ముట్టేది. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు గుంట భూమి ఉన్న రైతైనా సరే చనిపోతే రూ.5 లక్షలు టంచనుగా వారి కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో వచ్చి పడుతున్నాయి. ఈ సదుపాయం అమెరికాలో లేదు.. ఇంగ్లాండ్లో లేదు.. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. మన దేశంలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ధరణిలో వివరాలు పకడ్బందీగా ఉండటం వల్లే ఇది సాధ్యమవుతున్నది. రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం కొంటున్నది. డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి. గతంలో అంగట్లోనో, బీట్లోనో వడ్లు అమ్మితే చిట్టి రాసిచ్చేవారు. దాన్ని పట్టుకొని సేట్ల చుట్టూ, బీట్ల చూట్టూ వారాలపాటు తిరుగాల్సి వచ్చేది. మళ్లీ రాపో అంటే దేవుడా అనుకుంట తిరిగేది. ఇప్పుడు ఏ ఆఫీస్కు పోవాల్సిన అవసరం లేదు. ఎవరికీ దండం పెట్టే అవసరం లేదు. ఎక్కడా దరఖాస్తు పెట్టే అవసరం లేదు. నేరుగా బ్యాంకులో పడుతున్నయి. ధరణి వల్లే ఇది సాధ్యమైంది.
రుణమాఫీ చేస్తమని ఎన్నికల సమయంలో చెప్పినం. మధ్యలో కరోనా దెబ్బ కొట్టింది. కేంద్రం దిక్కుమాలిన నోట్ల రద్దు నిర్ణయం వల్ల మరి కొంత దెబ్బతిన్నం. అందుకే కొంత ఆలస్యం అయినా ఇచ్చిన మాట నిలుపుకున్నం. ఇప్పటివరకు చేసిన రుణమాఫీ రూ.37 వేల కోట్లు. అవి రైతుల ఖాతాల్లోకి నేరుగా ఎట్లా వచ్చినయ్? ధరణి ద్వారా వచ్చిన అకౌంట్లు, రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్నయ్ కాబట్టి, కంప్యూటర్లో ఉన్నయ్ కాబట్టి బ్యాంకులో వచ్చి జమ అవుతున్నాయి. ఒకప్పుడు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సద్దులు కట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయే పరిస్థితి. పొద్దుగాలపోతే ఆ రోజు వస్తదో తెల్లారి వస్తదో కూడా తెలియదు. ఆ తర్వాత మ్యుటేషన్ కావాల్నంటే ఆరు నెలలు, ఏడాది కూడా పట్టేది. దక్షిణ సమర్పిస్తే తప్ప పని కాకపోయేది. కానీ ఇయ్యాల ఎవరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, అప్పటికప్పుడే మ్యుటేషన్ అవుతున్నది. ధరణితో వచ్చిన మంచి సదుపాయం ఇది. ధరణిని తీసేస్తే ఒక్క రూపాయి లంచం లేకుండా డబ్బులు ఇట్ల వస్తయా? కాబట్టి ధరణిని ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవాలె. ఎవడైతే ధరణి తీసేస్తా అన్నడో వాడ్నే తీసి బంగాళాఖాతంలో విసిరేయాలి.
వడ్ల కల్లాలు లేచేటప్పుడు అడుక్కుతినేవాళ్లు వచ్చినట్టు ఎలక్షన్లు రాగానే చాలామంది బయలుదేరుతరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఆగమాగం కావొద్దు. తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. నిజమేంది? వాస్తవమేంది? ఎవరు ఏం మాట్లాడుతున్నరు? గతంలో ఎవరు ఎలా పనిచేశారు? ఎవరు నిజమైన ప్రజాసేవకులు? అని గుర్తిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. బాగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్లు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నరు. కొత్తగా చాన్స్ ఎందుకు? 50 ఏండ్లు కాంగ్రెస్సే పరిపాలించింది కదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్టకు నీళ్లు రావాలంటే మెదక్ ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సి వచ్చేది. ప్రతి సంవత్సరం ధర్నా చేస్తే తప్ప నీళ్లు వచ్చేవి కాదు. ఘనపురం కాల్వల్లో తుమ్మచెట్లు మొలిచాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్మాదేవేందర్రెడ్డితో కలిసి హెలికాప్టర్లో సర్వే చేశాం. ఆనకట్ట ఎత్తును పెంచుకున్నాం, కాల్వలు బాగు చేసుకున్నం. ఇప్పుడు ఆనకట్ట కింద అద్భుతంగా 30-40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టు మొత్తాన్ని హైదరాబాద్కు దత్తత ఇచ్చి మెదక్, నిజామాబాద్లోని ఆయకట్టు పొలాలను ఎండబెట్టారు. ఇప్పుడు సింగూరును మెదక్కే పరిమితం చేసినం. దీంతో మనకు అవసరం ఉన్నప్పుడు నీళ్లు తెచ్చుకొని ఘనపురం ఆనకట్ట కింద గుంట భూమి కూడా ఎండిపోకుండా పంటలు పం డించుకుంటున్నం. మెదక్లో పారే హల్దీ, మం జీర వాగుల్లో నీళ్లు వదిలి 365 రోజులు సజీవంగా ఉండేలా చేసుకుంటున్నం. కాళేశ్వరంలో భాగంగా మల్లన్నసాగర్ కట్టుకున్నం కాబ ట్టి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లను వాగుల్లోకి విడుస్తున్నాం. దీంతో జిల్లాలోని చెక్డ్యాంలన్నీ మత్తళ్లు దుంకుతున్నయి. నీళ్లను వాగు నుంచి తీసుకుంటున్నవా? ప్రాజెక్టు నుం చి తీసుకుంటున్నవా? ఎన్ని హెచ్పీల మోటర్లు పెట్టినవ్ అని అడిగేటోళ్లు లేరు. అందుకే బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నం.
తెలంగాణ రాకముందు వ్వవసాయం లేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఉండేవారు. చాలామంది భూమి ఉన్నవాళ్లు కూడా హైదరాబద్కు పోయి ఆటోలు నడిపే పరిస్థితి. రైతును ఏవిధంగా అయినా సరే బాగు చేయాలనే గట్టి సంకల్పంతో అనేక కార్యక్రమాలు మొదలుపెట్టినం. కాళేశ్వరం నిర్మించిన నీళ్లు తెచ్చుకున్నం. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తున్నం. ఫలితంగా బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నం. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు తెలుసు. మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ అంటున్నది. మీటర్లు పెట్టకపోవడం వల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి దాదాపు రూ.25 వేల కోట్ల నష్టం కలిగించింది. అయినా ఓర్చుకొని నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టం అని చెప్పిన.
50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా మంచినీళ్ల కష్టాల గురించి ఆలోచించిందా? మెదక్ పట్టణంలో గతంలో మూడునాలుగు రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవి. గతంలో నేను మంత్రిగా, జగపతి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరిపోకపోయేది. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి నీళ్లు అందుతున్నాయి. పట్టణాల్లో ప్రభుత్వం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి, ప్రతిరోజు నీళ్లను తెచ్చి అందిస్తున్నది. 1.03 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చి, నీళ్లు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. రైతులకు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక జూనియర్ కాలేజీ కావాలంటే 15 ఏండ్లు ఆఫీసుల చుట్టూ తిరిగిన. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జూనియర్ కాలేజీలు వచ్చాయి? దళిత, బీసీ, మైనార్టీ, గిరిజిన బిడ్డల కోసం వెయ్యికిపైగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. అందులో చదువుతున్న పిల్లలు మాట్లాడుతున్న ఇంగ్లిష్గానీ, నీట్లో ఆలిండియా కోటాలో వారు తీసుకొస్తున్న ర్యాంకులుగానీ చూస్తుంటే రెసిడెన్షియల్ కాలేజీలు రాష్ర్టానికి తలమానికంగా ఉన్నాయి. దుర్మార్గులకు, చేతగానివాళ్లకు అధికారం అప్పజెప్పి ఇవన్నీ చెడగొట్టుకోవాలా? ఉన్న సదుపాయాలు పోగొట్టుకోవాలా? ప్రజలు ఆలోచించాలి.
ఎన్నికల సమయం కాబట్టి కాంగ్రెస్వాళ్లు వచ్చి ఆపద మొక్కులు మొక్కుతరు. ఆనాడు రూ.200 పెన్షన్ ఇచ్చినోడు.. ఇయ్యాల కొండమీద కోతిని తెచ్చిస్తా, చందమామలు తెచ్చిస్తా, సూర్యుడిని తెచ్చిస్తా, రూ.4 వేల పెన్షన్ ఇస్తా అంటడు. రూ.200 ఇచ్చినోడు రూ.4 వేలు ఇస్తమంటే నమ్మొచ్చునా? నమ్మే ముచ్చటేనా? ఇదేమన్న అర్రాస్ పాటనా? ఉట్టిమాటలకు మేము కూడా రూ.5 వేలు ఇస్తమని చెప్పలేమా? కానీ మేము ప్రజలను మోసం చెయ్యం. ఒక క్రమపద్ధతిలో ఏ విధంగా పెంచాలో ఆ విధంగ పెంచుకుంటూ పోతాం. అక్టోబర్ 16న పెద్ద సభ ఉన్నది. అక్కడ బ్రహ్మాండంగా అనౌన్స్ చేసుకుందాం. సర్కారును నడిపించుడంటే సంసారం చేసినట్టే ఉంటది. మొదట కల్యాణలక్ష్మి రూ.51 వేలే ఇచ్చినం. ఆర్థిక పరిస్థితి పెరిగినకొద్దీ లక్షకు పెంచుకున్నం. అదేవిధంగా పెన్షన్ ముందు రూ.వెయ్యి ఇచ్చినం, రెండో దఫా వచ్చేసరికి ఆర్థికంగా పెరిగినం కాబట్టి రూ.2 వేలు చేసుకున్నం. ముందుముందు కూడా పెంచుకుంటూ పోతాం. రాష్ర్టాన్ని ఇంకా బాగా పురోగమింపజేయాలె. ఇంకా ధనికరాష్ట్రంగా ఎదగాలె. పేదలందరినీ ఆదుకోవాలె. మోసకారుల మాటలు నమ్మితే మనం గోసపడతం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలె. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించండి.
రాష్ట్రంలో రైతుల మొఖం ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నది. ఇయ్యాల రైతుల ఆత్మహత్యలు లేవు. గ్రామాలు పచ్చబడుతున్నయ్. మంచిమంచి ఇండ్లు కడుతున్నరు. గ్రామానికి ఎన్ని కార్లున్నయ్ అని ఇందాక మీ ఎమ్మెల్యేని అడిగితే ఒక్కో ఊరికి 70-90 కార్లు అని చెబుతున్నరు. ఇదే విధంగా ఇంకొక ఆరేడేండ్లు నడిస్తే మొత్తం రైతాంగమంతా బ్రహ్మాండంగా తయారైతది. ఇయ్యాల వరిధాన్యం పండించడంలో మనం దేశంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగినం. ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు రాష్ట్రంలో రైస్ మిల్లులు సరిపోతలేవు. మీరు పేపర్లలో, టీవీల్లో చూసిన్రు.. జపాన్ నుంచి కంపెనీవాళ్లని పిలిపించి వాళ్లకి గవర్నమెంటు తరపునే అధునాతన రైస్మిల్లులను ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నయ్. పండిన ధాన్యం టకాటకా బయటికి పోవాలె. అవి బియ్యంగా మారితే తప్ప బయటికిపోవు. లారీలు గుంజలేక చచ్చిపోతున్నయ్. రెండు-రెండున్నర నెలలు గుంజితే కూడా ధాన్యం తగ్గుతలేదు. ఎక్కడచూసినా వానకాలం కల్లాలుగానీ, యాసంగి కల్లాలుగానీ, డాంబర్రోడ్లన్ని కల్లాలే. మొత్తమంతా లక్ష్మీ అమ్మవారు ఓలలాడుతున్నట్టుగా అద్భుతమైన పంటలు పండుతున్నయ్.
ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎన్నికల సమయంలో అలవిగాని వాగ్దానాలు చేశారు. గెలిచిన తెల్లారే తట్ట, పార కింద పెట్టేశారు. ఇప్పుడు కర్ణాటకలో సాగుకు 7 గంటల కరంటే ఇస్తున్నారు. పొద్దాక 3 గంటలు, రాత్రి 4 గంటలు. అలాంటివాళ్లు మాకొక చాన్స్ ఇయ్యండి అని ఇక్కడ అడుగుతున్నరు. ఎందుకు నాయనా.. మేం 24 గంటల కరెంటు ఇచ్చుకునుడు నచ్చుతలేదా? కాంగ్రెస్వాళ్లు వ్యవసాయానికి మూడు గంటలు చాలు అంటున్నరు. ఎప్పుడన్న వ్యవసాయం చేసిన ముఖమేనా అది? మూడు గంటల కరెంటుతో ఎకరమైనా తడుస్తదా? ఇయ్యాల 24 గంటల కరెంటు ఉంటే.. ఎవరికి ఇష్టమున్న సమయంలో వాళ్లు బోర్లు వేసుకుంటున్నరు. ఇయ్యాల మోటర్ కాలదు, ట్రాన్స్ఫార్మర్ కాలదు. కాలితే బుల్లెట్లాంటి మీ ఎమ్మెల్యేలున్నరు.. ఐదు నిమిషాల్లో మళ్లా ట్రాన్స్ఫార్మర్ తెప్పిస్తరు. ఈ విధమైన సదుపాయం ఉండాల్నా, పోగొట్టుకోవాలా?