CM KCR | బోథ్ : ఆదిలాబాద్ జిల్లాలోని చనకా – కొరటా ప్రాజెక్టు పూర్తి కావొస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బోథ్ నియోజకవర్గం పరిధిలోని తిప్పల్ కోటి రిజర్వాయర్కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం జరుగుతది.. ఆ పని తప్పకుండా చేయిస్తా అని హామీ ఇస్తున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం.. గులాబీ జెండా ఎగిరిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం. 15 ఏండ్లు రాజీ లేకుండా మడమతిప్పకుండా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో తెలంగాణను కలిపిస్తే 58 ఏండ్లు అరిగోస పడ్డాం. 1969లో 400 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చారు. కానీ 15 ఏండ్ల వరకు తెలంగాణ ఇవ్వకుండా మోసం చేశారు. టీఆర్ఎస్ పార్టీని చీలగొట్టి కిందమీద చేసే ప్రయత్నం చేశారు. చివరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా దొంగల్లో కలిసిపోయారు. చివరకు తిక్కరేగి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ దీక్ష చేపడితే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేశారు. కానీ అప్పుడు ఇవ్వలేదు. మళ్లీ ఏడాదిన్నర పాటు ఉప్పెనలా పోరాటం చేస్తే అప్పుడు తెలంగాణ ఇచ్చారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
ఈ ప్రాంతంలో బోర్లు వేసి, పత్తి వేసి, రైతుల అప్పుల పాలయ్యారు. చాలా బాధలు పడ్డారు. చెరువులు పూడిపోతే చెరువుల పూడికలు తీయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 80 చెరువులను బాగు చేసుకున్నాం. కొత్తగా 10 చెరువులు కట్టుకున్నాం. భూగర్భ జలాలు పైకి వచ్చాయి. చనకా – కొరటా కంప్లీట్ అవుతుంది. మీ ప్రాంతంలో తిప్పల్ కోటి రిజర్వాయర్కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం జరుగుతది. ఆ పని తప్పకుండా చేయిస్తా అని హామీ ఇస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
58 ఏండ్లు అరిగోస పెట్టి కరెంట్ సక్కగా ఇవ్వకుండా, మంచినీళ్లు ఇవ్వకుండా బాధపెట్టిండ్రు కాంగ్రెస్ నాయకులు. ఒకప్పుడు ఆదిలాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే అంటురోగాలు. మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. అవి చూసి మనం ఏడ్సేది. అంటురోగాలతో సతమతమయ్యేది. ఆ అంటు రోగాలు చావులు ఇవాళ లేవు. పది గుడిసెలు ఉన్న గూడెంకు కూడా మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి. గతంలో మంచినీళ్లకు చాలా బాధపడ్డాం. కాంగ్రెస్ రాజ్యంలో సాగు, తాగునీళ్లకు బాధలు అవనుభవించాం. తెలంగాణ వచ్చిన తర్వాత కచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం. రైతులు బాగుపడాలి.. వ్యవసాయం బాగుపడాలని ఒక ప్రణాళిక వేసుకున్నాం. నీటి తిరువా రద్దు చేశాం. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఇస్తున్నాం. ఇవాళ రైతులు అప్పులు చేసే బాధ తప్పింది. రైతు చనిపోతే 5 లక్షల బీమా వారంలోపే జమ చేస్తున్నాం. అది కాకుండా రైతు పండించిన ధాన్యాన్ని గవర్నమెంటే కొంటోంది. మద్దతు ధర ఇస్తుంది. దీంతో వ్యవసాయం మంచిగ అయింది అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఒక పెద్ద ప్రమాదం రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మాట్లాడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడు. రైతుబంధు ఉండాలంటే అనిల్ జాదవ్ గెలవాలి. రైతుబంధు పది వేల నుంచి 16 వేలు అవుతుంది. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ వల్ల నష్టం.. మూడు గంటల సరిపోతది అంటున్నడు. మూడు గంటలతో పొలం పారుతాదా..? 24 గంటల కరెంట్ ఉండాలంటే అనిల్ జాదవ్ గెలవాలి. లేకపోతే ఉన్న కరెంట్ గ్యారెంటీగా ఊడగొడుతారు అని కేసీఆర్ తెలిపారు.
ధరణి తెచ్చి మీ భూములకు రక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. రైతుబంధు డబ్బులు ధరణి ద్వారా జమ చేస్తున్నాం. ఆ డబ్బును విత్తనాలకు, ఎరువులకు వాడుకుంటున్నారు. అప్పుల బాధ తప్పింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నారు. మరి ధరణి ఎత్తేస్తే రైతుబంధు ఎలా వస్తదో ఆలోచించాలి. అందుకే ఓటు ఆలోచించి వేయాలి. ధరణి ఎత్తేస్తే మళ్లీ పైరవీకారులు, దళారీల రాజ్యం వస్తది. మీరు ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా, ఆఫీసుకు వెళ్లకుండా, కడప దాటకుండా.. హైదరాబాద్ నుంచి మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.