CM KCR | గజ్వేల్ : గజ్వేల్ నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ ఎన్నికలు కాగానే మన గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళితబంధు తెచ్చుకుందాం. గజ్వేల్ నియోజకవర్గ దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి అవతల పడేద్దాం అని కేసీఆర్ పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నాకు ఫిబ్రవరి నెల వస్తే 70 సంవత్సరాల వయసు వస్తా ఉంది. మీ అందరి ఆశీర్వచనంతోని.. తెలంగాణ తెచ్చిన కీర్తే నాకు ఆకాశమంత ఎత్తు కీర్తి. పదవులు కాదు ఇక్కడ ముఖ్యం. ఆల్రెడీ పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీ ఆశీస్సులతో. తెలంగాణ రేపు ఒక అద్భుతమైన రాష్ట్రం కావాలి. పేదరికం శాశ్వతంగా పోయే రాష్ట్రం కావాలి. నిరక్షరాస్యత లేని వంద శాతం అక్షరాస్యత ఉండే రాష్ట్రం కావాలి. చాలా వైద్య సదుపాయాలు ప్రజలకు ఫ్రీగా అందే తెలంగాణ కావాలి. పేదలు లేని తెలంగాణ కావాలి.. ఉట్టిగా నోరుతోటి చెబితే కాదు. ఇందిరమ్మ కాలంలో దళితుల కోసం మంచి పనులు చేసి ఉంటే ఇవాళ దళిత వర్గాలకు ఇంత దరిద్రం ఎందుకు ఉండేది. వాళ్లు చేయలేదు కాబట్టే ఇంకా దరిద్రం ఉంది. దళితులు మన సాటి మనషులు. వాళ్లు వివక్షకు, దోపిడీకి గురయ్యారు. వాళ్లు కూడా మనతోపాటు పైకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే దళితబంధు ప్రోగ్రాం తెచ్చాం. గజ్వేల్ నియోజకవర్గ దళిత బిడ్డలందరికీ శుభవార్త చెప్తున్నా. ఈ ఎన్నికలు కాగానే మన గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళితబంధు తెచ్చుకుందాం. గజ్వేల్ నియోజకవర్గ దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి అవతల పడేద్దాం. ఆ రకంగా కార్యక్రమాలు చేసుకుందాం అని కేసీఆర్ తెలిపారు.