తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మా రైతులది దుఃఖచరిత్ర. ఒక్కోరోజు 10 మంది.. 12 మంది.. 15 మంది.. 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేది. రైతుల బాధలు వినేవాళ్లే లేరు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యను అధిగమించాం. వ్యవసాయరంగంతోపాటు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును ఇస్తున్నాం. మాకు తోచినంత.. మేము చేయగలిగినంత మా రైతులకు మేం చేసుకుంటూ పోతున్నాం.
– చండీగఢ్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గలేదని, ప్రాణం పోయినా బాయిలకాడ మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. కేంద్రప్రభుత్వం రైతుల రక్తం తాగుతున్నదని ఆయన మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వంపై మరింత ధాటిగా పోరాడాలని కోరిన కేసీఆర్.. రైతు ద్రోహులను కూల్చేద్దామని పిలుపునిచ్చారు. న్యాయం దక్కేదాక పోరాటాలు ఆగొద్దని ఆయన అభిప్రాయపడ్డారు.
పంజాబ్, హర్యానా వరకే రైతు ఉద్యమాలు పరిమితం కాకూడదని.. దేశ నలుమూలలకూ విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల మద్దతు లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటు కాదని పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరించారు. ఆదివారం చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియంలో అమరులైన రైతుల, సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థికసాయం అందజేశారు. పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి బాధిత కుటుంబాలకు ఆయన రూ.3లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ, పంజాబ్ రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు సంతోష్కుమార్, గడ్డం రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కార్పొరేషన్ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, గజ్జెల నగేశ్, రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఉద్విగ్నంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే…
దేశం ఎటుపోతున్నది?
కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తలవంచి నమసరిస్తున్నాను. ఇది సంతోషకరమైన ముచ్చట కాదు. చాలా విచారించాల్సిన మాట. 75 ఏండ్ల స్వాతంత్రం తర్వాత కూడా మనకు ఇలాంటి సభలు జరుపుకోవాల్సిన అగత్యం పట్టడం బాధాకరమైన విషయం. కండ్లలో నీళ్లు తిరుగుతున్నయ్. చాలా దుఃఖం వస్తున్నది. మనదేశం ఇలా ఎందుకున్నదని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిస్థితికి మూలం ఏమిటి? కారణం ఎవరు? ఈ దేశ పౌరుడిగా ఈ పరిస్థితిపై చర్చ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దేశం ఎటుపోతున్నది? దేశంలో ఏం జరుగుతున్నది? దీనికి కారకులెవరు? ఇటువంటి విషయాలపై విస్తృతంగా చర్చ జరుగాలి. ప్రతీ అంశానికి, ప్రతీ సమస్యకు.. ఒక పరిష్కారం ఉంటుంది. అయితే ఆ పరిష్కారం ఏమిటన్నదే ప్రశ్న. దేశంలో ఏదో ఒకచోట ప్రతిరోజూ రైతాంగం ఆందోళన చేస్తూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని రద్దు చేసుకునేదాకా రైతులు ఉద్యమించారు. ఎంత ఒత్తిడి తెచ్చినా..తమ లక్ష్య సాధన దిశలో మడమతిప్పని పోరాటం చేసిన రైతులకు, రైతు ఉద్యమనాయకులకు అభినందనలు.
పంజాబ్ మహోన్నత రాష్ట్రం
రెండు విషయాల్లో పంజాబ్ దేశానికి స్ఫూర్తిని రగిలించింది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో స్ఫూర్తినిచ్చిన యోధుడు భగత్సింగ్ పుట్టిన నేల పంజాబ్. అలాగే దేశం అన్నమో రామచంద్రా.. అని అలమటిస్తున్నప్పుడు మొట్టమొదట హరిత విప్లవాన్ని సృష్టించింది పంజాబ్. తమ రక్తాన్ని చెమటగా మార్చి.. దేశంలోని అనేక రాష్ర్టాలకు అన్నంపెట్టిన కర్షకులున్న రాష్ట్రం. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన పోరాటంలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబుతో పాటు పంజాబ్కు చెందిన నలుగురు సైనికులు వీరమరణం పొందారు. మా దగ్గర కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని ఆదుకున్నాం. అదే సమయంలో ఇక్కడికొచ్చి అమర జవాన్ల కుటుంబాలను కలిసి పరామర్శించాలని అనుకున్నాం. అయితే అప్పుడు ఇక్కడ ఎన్నికలు జరుగుతుండడంతో.. ఆ సమయంలో ఇక్కడికి రావడం భావ్యం కాదని రాలేదు. ఇప్పుడా అవకాశం దక్కింది. పంజాబ్ రైతు కుటుంబాలను, గల్వాన్లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలను కలిసి పరామర్శించేందుకు రావాలని కోరగానే కేజ్రీవాల్ ఒప్పుకొన్నారు. వారు కూడా నాతో వచ్చారు.
కరెంట్ కష్టాలను అధిగమించాం..
ప్రతీ రాష్ట్రం రైతుల కోసం తమ పరిధిలో, తమ తమ పరిమితుల్లో ఎంతోకొంత చేస్తున్నాయి. చేయాలి. మేమూ మా దగ్గర చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మా రైతులది దుఃఖచరిత్ర. చాలా దయనీయంగా ఉండేది. ఒక్కోరోజు 10 మంది.. 12 మంది.. 15 మంది.. 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేది. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. రాత్రిపూట వ్యవసాయ మోటర్లు వేసేందుకు పోతే పాములు కుట్టేవి. చాలా ఇబ్బందికర పరిస్థితులుండేవి. ఈ బాధలు వినేవాళ్లు ఉండేవారే కాదు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భగవంతుడి దయతో సమస్యను అధిగమించాం. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నాం. వ్యవసాయరంగానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును ఇస్తున్నాం. మాకు తోచినంత.. మేము చేయగలిగినంత మా రైతులకు మేం చేసుకుంటూపోతున్నాం.
ఉద్యమాన్ని కొనసాగించాల్సిందే…
దేశరాజధానిలో ఉద్యమిస్తున్న సమయంలో రైతులపై అనేక ఆరోపణలు చేశారు. పోరాటం చేస్తున్న రైతులను దేశద్రోహులన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదులన్నారు. అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. మేమూ విన్నాం. అయినా సరే ఏమాత్రం తొణకకుండా ఉద్యమాన్ని నడిపించారు. ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని రైతు నాయకులను కోరుతున్నాను. పంజాబ్, హర్యానా రాష్ర్టాల నుంచే కాకుండా యావత్ భారతదేశం నుంచి ఈ ఉద్యమం నడవాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నలుదిక్కుల నుంచీ రైతులందరూ ఉద్యమంలో పాల్గొనాలి. ఉద్యమించటం మన హక్కు. దేశానికి, ప్రపంచానికి అన్నం పెడుతున్నడు రైతు. పొలాల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండిస్తున్నడు. మనకు న్యాయం దకాలి. న్యాయం దక్కేదాకా పోరాడాలి. దేశంలో దుర్మార్గమైన, దయనీయమైన వాతావరణం పోవాలి. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. రైతులు లేనిదే ప్రభుత్వాలు ఏర్పడుతయా? అధికారం గాల్లోంచి వస్తుందా? రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు దక్కాలి. దానికి పార్లమెంట్ రక్షణ కల్పించాలి. రైతులు పండించిన పంట విలువకు రాజ్యాంగపరమైన రక్షణ లభించేదాకా పోరాటం ఆగొద్దు. పోరాటం చేసేవాళ్లకు మేం ఎప్పుడూ తోడుగా ఉంటాం. అన్ని విధాలా మద్దతిస్తాం.
త్యాగధనుల కుటుంబాలకు అండగా ఉంటాం
రైతు ఉద్యమంలో మన కిసాన్ నేలకొరిగారు. దేశరక్షణ కోసం చైనా సరిహద్దులో మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. కానీ మీ వెనుక మేమున్నాం. ప్రాణాలు కోల్పోయిన త్యాగధనుల, పోరాటశీలుర ఆత్మశాంతించాలని సహృదయంతో భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో అందరం కలిసికట్టుగా ఉంటాం. మీరు ఒంటరి కాదు…మీకోసం మేమున్నాం. మీ వెనుక యావత్ దేశం ఉంది.
ప్రాణం పోయినా మీటర్లు పెట్టం
ఈరోజు ఢిల్లీలో మన నెత్తిన కూర్చున్న ప్రభుత్వం.. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలంటున్నది. ఒక్కో రైతు కరెంట్ ఎంత వాడుకున్నడో లెక్కలు వేయాలంటున్నది. రైతుల రక్తాన్ని తాగేలా చార్జీలు వసూలు చేయాలని చెబుతున్నది. ఈ విషయంలో నా ప్రాణం పోయినా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనని అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పాం. ఏం చేసుకుంటారో చేసుకోండని తెగేసి చెప్పాం (సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది). రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలన్నా, అన్నదాతల జీవితాలను బాగు చేయాలనే ఆలోచించే ముఖ్యమంత్రులన్నా కేంద్రానికి నచ్చదు. పైగా ఒత్తిడి తెస్తారు. అయినా మంచిదే.. ఎందాక అయితే అందాక మేం తయార్గా ఉన్నం (చప్పట్లు).
పండించిన పంటకు రాజ్యాంగ రక్షణ కల్పించే పార్టీకే మద్దతు
రైతు పండించిన పంటకు కనీస మద్దతు కల్పించేందుకు, రాజ్యాంగరక్షణ అంశానికి కట్టుబడి ఉండే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మనం మద్దతివ్వాలి. దేశవ్యాప్తంగా రైతు నాయకులు ఈ రకమైన పరిస్థితి సృష్టించినప్పుడు పండించిన పంటకు రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుంది. రైతు పక్షపాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఏకమవుతాయి. ఇప్పటినుంచి రైతులు చేసే ఉద్యమాలకు మేం కూడా తోడుగా ఉంటాం. అన్నివిధాలా అండగా నిలుస్తాం. ఢిల్లీ సరిహద్దుల్లో నడిచిన రైతు ఉద్యమానికి కేజ్రీవాల్ తమవంతు సహాయం చేశారు. రైతులను రక్షించే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చేవరకు పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తాం. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని రైతు నాయకులను నేను ప్రార్థిస్తున్నాను. ఎప్పటి వరకు పోరాటం చేస్తారో అప్పటి వరకు మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది. కేంద్రం దిగివచ్చేదాకా ఉద్యమాలను కొనసాగించాలి.
చిందిన ప్రతి రక్తపు బొట్టుకూ బదులు తీర్చుకొంటాం
మానవతా హృదయంతో మమ్మల్ని ఆదుకొనేందుకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రైతుల పోరాటం ముగిసిపోలేదు. చిందిన ప్రతి రక్తపు బొట్టుకు కేంద్రంపై బదులు తీర్చుకొంటాం. రైతు ఉద్యమంలో భర్తలను కోల్పోయిన మహిళలం ఇక్కడ ఎందరమో ఉన్నాం. మాకు తోడ్పాటు అందించడానికి మీరు (కేసీఆర్) ముందుకు వచ్చారు. మేమంతా మీరు చేసే పోరాటానికి అండగా నిలుస్తాం. మేమే కాదు మా బంధువర్గమంతా మీకు అండగా ఉంటుంది. జిందాబాద్ తెలంగాణ..
ముర్దాబాద్ మోదీ సర్కార్.
– కేసీఆర్ ప్రసంగం ముగియగానే , కేంద్రంపై హర్యానా మహిళా రైతు నిప్పులు