హైదరాబాద్: తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయం (Secretariat) నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో నూతన నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు.
పెద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగిందని, నీళ్లు రానే రావు.. సాధ్యమే కాదు.. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని చెప్పారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాల్లో చేర్చారని అన్నారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగతిలో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉంది. అనేక విభాగాలు కలిసి పని చేయడం వల్లే ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు. అద్భుతమైన రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. మంత్రుల నుంచి సర్పంచ్ వరకు, సీఎస్ నుంచి గ్రూప్ -4 ఉద్యోగుల వరకు అందరికీ నమస్కరిస్తున్నానని చెప్పారు.
సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, సమీకరించు, బోధించు పోరాడు అని సందేశం ఇచ్చిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, వారి సందేశంతోనే గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే మన ప్రయాణం కొనసాగుతున్నదని, ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వులు రావాలన్న అంబేద్కర్ స్ఫూర్తిని అందుకుని 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామన్నారు. అనునిత్యం అంబేద్కర్ స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో సచివాలయానికి ఆ మహానీయుడి పేరు పెట్టుకున్నామని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని హామీ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక చర్చలు మనం చూశాం. పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగేసే సమయంలో తెలంగాణ భావాన్ని, నిర్మాణాన్ని కాంక్షను జీర్ణించుకోలేని కొందరు పిచ్చివారు కారుకూతలు కూశారు. మొత్తం తెలంగాణనే కూలగొట్టి కడుతారా? అని మరగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. అవేమీ పట్టించుకోకుండా ఇవాళ పునర్నిర్మాణం చేసుకున్నాం. పునర్నిర్మాణం అంటే వచ్చిన నీటిని కోల్పోయిన చెరువులను పునర్నిర్మాణం చేసుకున్నాం. జీవనదులు, ఉపనదులు తెలంగాణలో ఉన్నాయి. గోదావరి నది ఎప్పుడు దాటినా అక్కడ చిల్లర డబ్బులు వేసి దండం పెట్టేవాడిని. మా పొలాలు ఎప్పుడు పండిస్తావని అడిగేవాడిని. తెలంగాణ ఇంజినీర్లు చేసిన అద్భుతమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది పునర్నిర్మాణం అంటే మనవి చేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.
‘తెలంగాణలో వెలుగు జిలుగులతో తెలంగాణ విరాజిల్లుతోంది. ఇది తెలంగాణ పునర్నిర్మాణం. కరెంట్ షాక్లతో రైతులు చనిపోయారు. కానీ, నేడు 24 గంటల కరెంట్తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ఆగమైపోయిన అడవులు పునర్నిర్మాణం చేసుకున్నాం. హరితశోభను వెదజల్లుతున్నాయి. వలసపోయిన పాలమూరు వాసులు తిరిగొచ్చి తమ పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. కూలీలు సరిపోక ఇతర రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వస్తున్నారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణం. మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రజలు తాగే నీటిని ఆదిలాబాద్లోని గోండు ప్రజలు సైతం తాగుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో మత కల్లోలాలు లేవు సీఎం కేసీఆర్ అన్నారు.
పారిశ్రామిక రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ విధానంలో బెంగళూరును దాటి పోతున్నాం. మురికి కూపాలుగా ఉన్న పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం. పచ్చదనం, డంపుయార్డులతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటుంది తెలంగాణ. అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లతో హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నాం. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు ఉన్నవి. ఒకటి పర్ క్యాపిట ఇన్కం. రెండోది పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్. ఇవి నిజమైన అభివృద్ధి సంకేతాలు. నేషనల్, జాతీయ స్థాయిలో ముందున్నాం. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, దేశంలోనే నంబర్ వన్ స్థాయికి పర్ క్యాపిటలో ముందున్నాం. పవర్ యుటిలైజేషన్లో 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగాన ఉన్నాం సీఎం కేసీఆర్ అన్నారు.