హైదరాబాద్: రాజకీయాలన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి.. అలకలూ ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలని చెప్పారు. అందరి కంటే ఎక్కువగా అభ్యర్థులు ప్రజల్లో ఉండాలని సూచించారు. చిన్న కార్యకర్తతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. దీనిని ప్రతిఒక్కరు తప్పకుండా పాటించాలని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎన్నికల సందర్భంగా వ్యక్తిత్వం మార్చుకోవాలని ఒకరిద్దరికి చెప్పాను. మాట్లాడలేదు. ఒకరు ఓడిపోయారన్నారు.
జూపల్లి కృష్ణారావు ఒకాయన ఉండే.. మంత్రిగా పని చేశారు. ఆయన అహంకారంతో ఇతర నాయకులతో మాట్లాడలేదు. ఓడిపోయారు. అలా ఉంటది. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. నాయకుల చిలిపి పనులు, చిల్లర పనుల వల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కారవంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్రవర్తించడం నేర్చుకోవాలని సీఎం సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నా.. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. కార్యకర్తలకు మనల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని కేసీఆర్ సూచించారు.