నాలుగైదు నెలల్లో దేశంలో పబ్లిక్ సెక్టార్లో స్థాపించిన అతిపెద్ద అల్ట్రా పవర్ మెగా ప్లాంట్ ప్రారంభం కాబోతున్నది. జెన్కో ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల పవర్ స్టేషన్ ఇది. రూ.30 వేల కోట్లతో నల్లగొండ జిల్లా దామరచర్లలో పెట్టాం.
– అసెంబ్లీలో సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో గాడాంధకారంలో మగ్గిపోయిన తెలంగాణను, నేడు విద్యుత్తు కాంతుల తెలంగాణగా మార్చామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లు. ఈ రోజు 18,756 మెగావాట్లు. నాలుగైదు నెలల్లో దేశంలో పబ్లిక్ సెక్టార్లో స్థాపించిన అతిపెద్ద అల్ట్రా పవర్ మెగా ప్లాంట్ ప్రారంభం కాబోతున్నది. జెన్కో ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల పవర్ స్టేషన్ ఇది. రూ.30 వేల కోట్లతో నల్లగొండ జిల్లా దామరచర్లలో పెట్టాం. అక్కడ మా ఎమ్మెల్యే భాస్కర్రావు, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఉన్నారు. కాకతాళీయంగా తెలంగాణలో ఉన్న పవర్ స్టేషన్లన్నీ ఉత్తరభాగంలో ఉన్నాయి. కొత్తగూడెం కావ చ్చు, పరకాలలోని కాకతీయ కావచ్చు, భద్రాద్రి కావచ్చు, అంతకు ముందున్న రామగుండం ఎన్టీపీసీ కావచ్చు, నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు.. అన్నీ గోదావరి వడ్డున ఉత్తరం వైపే ఉన్నాయి.
పవర్లోడ్ సెంటర్కు రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్తు సంస్థ ఉండాలి. 2,444 మెగావాట్ల విద్యుత్తు శ్రీశైలం మీద, నాగార్జునసాగర్ మీద ఉన్నా యి. అది జల విద్యుత్తు. 24 గంటలు రాదు. నీళ్లు అయిపోతే పోతది. దక్షిణ తెలంగాణలో పవర్ప్లాంటు పెట్టాలన్నప్పుడు జగదీశ్రెడ్డి కృష్ణా ఒడ్డున పెట్టాలన్నారు. సాగర్ కింద టేల్పాండ్లో నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. పది-పదకొండు టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి. మహబూబ్నగర్లో ఈ పరిస్థితి లేదు. నిపుణులు నిర్ధారించిన తరువాత దామరచర్లలో ప్లాంటు పెట్టాం. దానిమీద కూడా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. రూ.30 వేల కోట్లతో ప్లాంటు పెడితే దాన్నీ ఆపేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. రామగుండం ఫస్ట్ ఫేస్ లో వచ్చింది 700 మెగావాట్లు మాత్రమే.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నేను కూడా ఆయన వెంట వెళ్లాను. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇవాళ కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఎలా ఉన్నది? ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే గర్వం గా చెప్పుకుంటారక్కడ. అలాంటిది ఏకబిగిన 4 వేల మెగావాట్లు వస్తే, వీళ్లకు దాని మంచి తెల్వదు, చెడు తెల్వదు. ఎన్ని లాభాలు ఉంటాయనేది తెల్వకుండా కాంగ్రెస్వాళ్లు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇట్లాం టి దుర్మార్గులని ఎట్ల గెలిపిస్తరని గత ఎన్నికల్లో నేను ప్రజలను అడిగిన. అభివృద్ధి గురించి వీళ్లకి కనీసం జ్ఞానం, సోయి ఉన్న దా? ప్రజలు గమనించి ఓడగొట్టిన్రు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దామరచర్ల ప్లాంట్ బంద్ చేస్తామంటున్నరు. కానీ వచ్చే మూడే నెలల్లో ప్లాంటును ప్రారంభిస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.