BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో తిరిగి మనమే అధికారంలోకి వస్తున్నాం.. బీఆర్ఎస్ పార్టీ 95 – 105 స్థానాల్లో గెలువబోతుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ఏర్పాటైన పదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని కేసీఆర్ వివరించారు. అనతి కాలంలో దేశానికి రోల్మోడల్గా తెలంగాణ ఎలా నిలిచిందో వివరించారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం సాధించుకొని అద్భుత ప్రగతితో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది..? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్లు వివరించాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు సహా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పండుగ వాతావరణంలో నిర్వహించాలి అని కేసీఆర్ సూచించారు.
రాష్ట్రంలో తిరిగి మనమే అధికారంలోకి వస్తున్నాం.. ఎవరికీ అనుమానం అక్కర్లేదు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి.. కచ్చితంగా 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ శాతం సీట్లు. నేను చెప్పినట్లు ఆచరిస్తే ప్రతి ఒక్కరికీ 50 వేల కన్నా అధిక మెజార్టీ వస్తుంది. పేదండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి దేశం తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటుంది. మహారాష్ట్రలోనూ ప్రజలు సైతం మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే అందుకు మనం ఆచరించి చూపిన మోడలే అని బాగా గుర్తుంచుకోవాలి. కులం, మతంపై ఏ పార్టీ గెలవదు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడడమే బీఆర్ఎస్ విజయ రహస్యం అని కేసీఆర్ పేర్కొన్నారు.