దమ్మూ ధైర్యం ఉంటే సిట్టింగులందరికీ టికెట్లిస్తానని చెప్పు! ఇదీ పీసీసీ అధ్యక్షుడి సవాల్!
గుండె నిండా దమ్మూ ధైర్యం ఉంది. చెప్పడం కాదు; ఏకంగా ఇచ్చి చూపించాడు కేసీఆర్!
ధైర్యం ఉంటే గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించు! ఇది విపక్షాల మరో చాలెంజ్!
ధైర్యం ఉంది. గజ్వేల్ నుంచి పోటీ. దాంతో పాటే అమ్మగారిల్లు కామారెడ్డి నుంచి కూడా! ప్రకటించి చూపించాడు కేసీఆర్!
తెలంగాణ రాష్ట్ర సాధన అనే మహోద్యమంలో మహా విజయం. రెండు ఎన్నికల్లో సంపూర్ణ ఆధిక్యం.. ఒకదానికంటే మరొకటి మిన్నగా. పదేండ్లు గడిచాయి. మూడో ఎన్నిక ముంగిట నిలిచిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనం సృష్టించారు. మొత్తం 119 స్థానాల్లో, 115 సీట్లకు ఒక్కరోజే, ఒక్కసారే, ఏకబిగిన బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించి కేసీఆర్ సంచలనం సృష్టించారు. అంతేకాదు, మొత్తం 105 మంది సిట్టింగుల్లో 98 మందికి మళ్లీ టికెట్లు ఇచ్చి, ఇదీ నా సత్తా.. కాస్కోండి అంటూ సవాల్ విసిరారు. లొట్టిపిట్ట పెదవులకు నక్క ఆశపడ్డట్టు, టీఆర్ఎస్ సిట్టింగులకు టికెట్లు నిరాకరిస్తే, వారిని చేర్చుకుందామని ఎదురుచూస్తున్న విపక్షాల ఆశలపై మల్లన్నసాగర్ నీళ్లు గుమ్మరించారు. చేరికల కమిటీలు ఇక రద్దు చేసుకుంటే మంచిదేమో!
‘సిట్టింగులపై విముఖత’ సిద్ధాంతం బుట్టదాఖలు. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ ప్రవచనానికి చెల్లుచీటి. ‘మూడోసారి…?’ ముచ్చటకు ఫుల్స్టాప్. పడికట్టు పదాల సిద్ధాంతాలకు ఒక్క దెబ్బతో జవాబు. అసమ్మతి భయం లేదు.. తిరుగుబాట్ల అనుమానం లేదు… ప్రత్యర్థిని చూసి ప్రకటించాలన్న సాచివేత అంతకంటే లేదు. తను నమ్మిన, తనను నమ్మిన జనంపై నమ్మకం. తన పరిపాలనా ఫలితాలపై చిక్కని విశ్వాసం. తను చేసిన తెలంగాణ అభివృద్ధిపై చెక్కుచెదరని భరోసా. కట్టుదప్పని తన జట్టుతోనే బెట్. మారని జట్టు… హ్యాట్రిక్ కొట్టు! ఔర్ ఏక్ ధక్కా.. కేసీఆర్ పక్కా! పక్క పార్టీలకు దరఖాస్తు సొమ్ములైనా దక్కేనా!
మూడో రణానికి ముహూర్తం ఇంకా ఖరారు కాకముందే… ఇంకా మూడు నెలల సమయం ఉండగానే… నోటిఫికేషన్ సంగతి దేవుడెరుగు; షెడ్యూలైనా విడుదల కాకముందే… శంఖారావమైనా వినిపించకముందే… కేసీఆర్ యుద్ధం పూర్తి చేశారు.
ప్రతిపక్షాలు బరిలోకైనా దిగకముందే బీఆర్ఎస్ నైతిక, మానసిక విజయాన్ని సొంతం చేసుకుంది. దటీజ్ ద లీడర్.. దమ్మున్న కేసీఆర్!
కొత్త రాష్ట్రమే అయినా, తక్కువ వనరులున్నా.. అనేక రాష్ర్టాలను అధిగమించి రాష్ర్టాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాం. తక్కువ సమయంలోనే తెలంగాణను వజ్రంలా తీర్చిదిద్దాం. మరింత ఉజ్వలమైన, ఉత్కృష్టమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతున్నా.
-సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు వచ్చినవారందరికీ అభినందనలు తెలిపారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రకటించినవాటిలో ఏడు చోట్ల వివిధ కారణాలతో సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. కొత్తవారికి అవకాశం కల్పించారు. వేములవాడ, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్ స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దింపుతున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మహాసముద్రంలాంటిదని, పార్టీలో ఎందరో సమర్థులైన నాయకులున్నారని తెలిపారు. టికెట్లు రానివాళ్లు నిరాశచెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రస్తుతం ప్రకటించిన స్థానాల్లో ఏడింటిలో వివిధ కారణాల వల్ల అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈసారి ఐదుగురు కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వానికి సంబంధించి న్యా యవివాదం ఉన్న నేపథ్యంలో తప్పనిసరై అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని తెలిపారు. దీంతోపాటు బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్లో అభ్యర్థులు మారినట్టు చెప్పారు. కామారెడ్డిలో స్వయంగా తానే పోటీ చేస్తున్నందున అది మార్పు కిందికి రాదని పేర్కొన్నారు. టికెట్లు రానివాళ్లు నిరాశ చెందాల్సిన అవసరం లేదని సూచించారు. టికెట్ రానివారు చిన్నబుచ్చుకొని, హడావుడి పడి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని కోరారు. పార్టీ అంటే సముద్రం వంటిదని, అనేక అవకాశాలు ఉంటాయని తెలిపారు. ‘పార్టీలో ఉండండి, అభ్యర్థులను గెలిపించుకోండి, తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ జీవితం అంటే ఎమ్మెల్యే మాత్రమే కాదు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీ ఇలా అనేక పదవులు ఉన్నాయి. గతంలో కూడా ఇచ్చినం’ అని పేర్కొన్నారు. తాజా జాబితాలో అతి పెద్ద వయస్కుడు వనమా(78) కాగా, అతిపిన్న వయస్కురాలు బడే నాగజ్యోతి(29).
బీఆర్ఎస్ ఎంతో క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. ఇక్కడ యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండవు. మేం ఒక్కసారే 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామంటేనే అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఒకటిరెండు చోట్ల ఉంటే.. దానిని భూతద్దాలు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాటిని మేం పట్టించుకోం. అది వాళ్లకే రివర్స్ కొడుతుంది. పార్టీ పూర్తిస్థాయి వడపోత తర్వాత ఈ జాబితాను సిద్ధం చేశాం. అనేక సర్వేలు నిర్వహించాం. అక్కడక్కడ ఏమైనా అసంతృప్తులు ఉంటే అవే సర్దుకుంటాయి. ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీ హైమాండ్ మాట్లాడుతుంది. పెద్దలు కేశవరావుతో కలిసి త్రీమెన్ కమిటీ వేస్తాం. ఆ కమిటీ అన్నీ చూసుకుంటుంది.
తెలంగాణలోని అనేక నియోజకవర్గాలవారు నన్ను పోటీ చెయ్యమని అడిగారు. కరీంనగర్లో పోటీ చెయ్యమని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే, నిజామాబాద్కు చెందిన మంత్రి నన్ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సారి మా దగ్గరి నుంచి పోటీచేయాలని కోరారు. వారి కోరిక మేరకే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నాను.
పెండింగ్లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తాం.
2014లోనే ఇదే తెలంగాణ భవన్లోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినప్పుడే రాజకీయ పంథా గురించి కూడా స్పష్టంగా చెప్పాను. తెలంగాణ రాష్ట్ర సాధనతో ఉద్యమ లక్ష్యం నెరవేరిందని, ఇక నుంచి తెలంగాణను తీర్చిదిద్దడం కోసం రాజకీయ పంథాతో వ్యవహరిస్తామని చెప్పాను.
మాకు ఎవరూ పోటీ అని అనుకోవడం లేదు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లలో గెలువబోతున్నామంటే.. ఇక పోటీ ఎక్కడిది? బీఆర్ఎస్, మజ్లిస్ కలిసే ముందుకెళతాయి. పాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని 29 స్థానాల్లో అన్నింటినీ బీఆర్ఎస్, మజ్లిస్ కైవసం చేసుకుంటాయి. ఇక్కడ వేరేవాళ్లకు అవకాశమే లేదు.
ప్రపంచమే గర్వించే ప్రాజెక్టు కాళేశ్వరం. అలాంటి దానిపై ఎందుకు ఈ అర్థం పర్థం లేని మాటలు? అసలు ప్రకాశ్ జవదేకర్ ఏం మాట్లాడతడో కూడా తెల్వదు. తోక తెల్వదు.. తొండం తెల్వదు. అసలాయనకు ఏం తెలుసని అట్ల మాట్లాడేది? ఇంకెన్నిసార్లు ఇలాంటి అర్థంపర్థం లేని మాటలు?
తెలంగాణ అనతికాలంలోనే అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా మారింది. ఇది మేం చెప్పేదేం కాదు. నీతిఅయోగ్ నివేదికలు స్పష్టం చేశాయి. పార్లమెంట్లో అనేక మంది కేంద్ర మంత్రులు లిఖిత పూర్వకంగా సమాధానాలిచ్చారు. ఈ దేశంలో ప్రతి ఇంటికి నల్లానీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సంక్షేమం, విద్యుత్తు వినియోగం, ఐటీ డెవలప్మెంట్.. ఇలా అనేక రంగాల్లో మనమే నంబర్ వన్. ఇచ్చిన మాట నిలుబెట్టుకోవడంలో వందశా తం సక్సెస్ అయ్యాం. వీటన్నింటినీ చూసి ప్ర జలు తప్పకుంటా మళ్లీ మమ్మల్నే ఆదరిస్తారు.
కర్ణాటకకు తెలంగాణతో పోలిక లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించినందుకు అక్కడి ప్రజలు ప్రస్తుతం చాలా బాధ పడుతున్నారు. బెంగళూరు వంటి సిటీలోనే పవర్ కట్తో ఐటీ కంపెనీలు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. అక్కడ ఎన్నో అలవికాని వాగ్దానాలు ఇచ్చి.. ఇప్పుడు తప్పారు. కొండమీది కోతిని తెచ్చిస్తానని చెప్పారు. ఎన్నికల కోసం ఆపద మొ క్కులు మొక్కే పార్టీలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిని ప్రజలెప్పుడూ పట్టించుకోరు.
50 ఏండ్లు అవకాశం ఇచ్చిన తర్వాత మళ్లీ ఒక్క చాన్స్ ఏంది? అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పెన్షన్ ముఖాన కొట్టినోళ్లు.. ఇప్పుడు మళ్లీ వచ్చి రూ.4 వేల పెన్షన్ ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా? మాకు చెప్పరాదా రూ.5 వేలు ఇస్తామని? గత ఎన్నికలప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రైతురుణం ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పింది. కానీ మేము మాత్రం రూ.1 లక్ష మాత్రమే దశలవారీగా మాఫీ చేస్తామని చెప్పాం. ప్రజలకు ఎవరేంటో తెలుసు. మాకు విజయాన్ని అందించి… కాంగ్రెస్ను తోల్కబోయి బొంద పెట్టినరు. బీజేపీ గెలుపు జోక్ ఆఫ్ ది సెంచరీ.
బీఆర్ఎస్ విజనరీ పార్టీ. ఎంతో క్రమశిక్షణ ఉన్న పార్టీ. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదు. వాళ్లు ఎంత పెద్దోైళ్లెనా సరే క్షమించే ప్రసక్తే లేదు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత వాళ్ల ఖర్మ వాళ్లదే.
ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి పనిచేసిన దేశాలే ప్రగతి సాధిస్తున్నట్టు రుజువు అవుతున్నది. మన దేశంలో బీఆర్ఎస్ పార్టీయే ఇందుకు ఉదాహరణ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి పనిచేయడంవల్లే నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అనేక రంగాల్లో ఎంతో ముందంజలో ఉన్నది. ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి పనిచేయడంవల్లే మేము గెలుస్తాం, ప్రజలను గెలిపిస్తాం. ఇటువంటి పని మొత్తం దేశంలో జరగాల్సి ఉన్నది. ఎన్నికల తరువాత ఎంతో సమయం ఉంటుంది. అప్పుడు దేశమంతా పర్యటించేందుకు ప్రయత్నిస్తా. మహారాష్ట్రతోపాటు పలు ఇతర రాష్ర్టాలను కూడా వెళ్తాను. నా కృషిని కొనసాగిస్తా.
మేం మొత్తం దేశాన్ని మార్చాలని అనుకుంటున్నాం. దీనికోసం తొందర పడటంలేదు. మా లక్ష్యం చాలా పెద్దది. దాన్ని సాధించేందుకు కృషిచేస్తాం. దేశం దృష్టిని ఆకర్షించేందుకు కేసీఆర్ ఏ విధంగా కృషిచేస్తాడో రానున్న రోజుల్లో మీరే చూస్తారు.
అభ్యర్థుల మార్పునకు ఒకటే కారణం ఉండదు. అనేక కారణాలు, అనేక రిపోర్టుల ఆధారంగానే మార్పులు చేశాం. ఈ విషయాన్ని వారికి కూడా చెప్పాం. అయినా దాదాపు అందరికీ టికెట్లు ఇచ్చాం. మార్పు కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే జరిగింది. ఇది చాలా స్వల్పం. ఇదే విషయాన్ని ముందుగానే ఆ ఎమ్మెల్యేలకు చెప్పాను.
అభ్యర్థుల జాబితా ప్రకటించామంటేనే ఎన్నికల హడావుడి మొదలయ్యిందని అర్థంకదా?
కాంగ్రెస్కు బీ టీమ్ అని బీజేపీ, కాదు బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయ్. మమ్మల్ని బీ అన్నోళ్లంతా ఏం చేశారో అందరికీ తెలుసు. మొన్ననే శరద్పవా ర్ మేం బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. తెల్లారే వెళ్లి బీజేపీతో కలిసిపోయారు. అందరిదీ పరిస్థితి అదే. అదంతా పాగల్ ముచ్చట.
కరోనా, నోట్లరద్దు బాగా దెబ్బకొట్టాయి. అందుకే ఇవ్వలేకపోయాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం.
కాంగ్రెస్, బీజేపీ అవినీతి ఆరోపణలు చేయడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటది. వాళ్ల పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలు, ఎంతో భయానక పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్ జవదేకర్కు ఏం తెలుసు? నోరుందికదా అని ఏదంటే అది మాట్లాడితే ఎలా?
మాకు స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉన్నది. అక్టోబర్ 16న వరంగల్లో సింహగర్జన సభ ఉంటుంది. ఆ రోజే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను రిలీజ్ చేస్తాం. కొత్తగా ప్రగతి ఏజెండా ఇంకేం కావాలి. కొనసాగుతున్న ప్రగతే కొనసాగిస్తాం. మంచి చేయాలని అనుకున్నోళ్లకు మ్యానిఫెస్టోతో పనేమున్నది? మేము మ్యానిఫెస్టోలో చెప్పని అనేక అద్భుతాలు చేసి చూపించాం. కల్యాణలక్ష్మి, రెసిడెన్షియల్ స్కూళ్లు, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతుబంధు, రైతుబీమా, మెడికల్ కాలేజీలు, దళితబంధు.. ఇవేకాదు ఇంకెన్నో మ్యానిఫెస్టోలో చెప్పకుండానే చేశాం. దేశంలో మరే రాష్ట్రంలోనైనా జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్నదా? ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు.
ఒక దేశం లేదా ఒక రాష్ట్రం ఎదుగుదలకు ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన కొన్ని గీటురాళ్లు ఉంటాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఆ అభివృద్ధి గీటురాళ్లలో మొదటిది తలసరి ఆదాయం. 2014లో రూ.1.20 లక్షలున్న తెలంగాణ తలసరి ఆదాయం, ఇప్పుడు రూ.3.12 లక్షలకు పెరిగింది.
60-70 ఏండ్ల నుంచి రాష్ర్టాలుగా కొనసాగుతున్న గుజరాత్ వంటివాటిని దాటేయడానికి కఠోరమైన క్రమశిక్షణే కారణం. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ప్రగతి పథంలో అన్ని రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ.. అందులోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల కృషి. కొత్త రాష్ట్రమే అయినా, తక్కువ వనరులున్నా.. రాష్ర్టాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాం. వజ్రంలా తీర్చిదిద్దాం. మరింత ఉజ్వలమైన, ఉత్కృష్టమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతున్నా. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎట్లాగూ ప్రజలు గెలిపిస్తరు. ఎంపీ ఎన్నికల్లో 17 సీట్లు గెలవాలి. మజ్లిస్తో మొదటి నుంచీ మాకు స్నేహం ఉన్నది. స్నేహపూర్వక పోటీ చేస్తాం. ప్రజలు కచ్చితంగా దీవిస్తారని నమ్మకం ఉన్నది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రియ చివరి దశలో ఉన్నది. కొన్ని పత్రికలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రగతిపై విషం చిమ్ముతున్నాయి. వారికి మాత్రం ఇచ్చేది లేదు. పాలు పోసి పామును పెంచలేం కదా? జర్నలిస్టులు ఒక విజన్తో ఉండాలి. కీలుబొమ్మలా ఉండకూడదు కదా? దేశంలో తెలంగాణతో పోల్చుకోవడానికి భయపడే రాష్ర్టాలు ఎన్నో ఉన్నాయి. రైతు రుణమాఫీ చెయ్యడం లేదని రాశారు. మొన్న ఒక్కసారే రూ.20 వేలకోట్ల మాఫీ చేసినం. ఇప్పుడు ఆ పేపర్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటది? అదొక పేపరా? దానికొక విలువ ఉన్నదా? తెలంగాణ ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్టులు వచ్చినయ్. నీతి ఆయోగ్ రిపోర్టులు వచ్చినయ్. పార్లమెంట్లో కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా చెప్పారు. అయినా సరే.. మేము ఒకటే రొడ్డ కొట్టుడు కొడతం అంటే ఎలా? అదేం పేపర్.. దిక్కుమాలిన పేపర్? ఎంతోకొంత మారాలి కదా? ఉద్యమ సమయంలోనే ఈ రాష్ట్రంలో కొన్ని కుల పత్రికలు, ఇంకొన్ని గుల పత్రికలు ఉన్నాయని చెప్పాను.