CM KCR | సిద్దిపేట : హుస్నాబాద్ గెలుపు.. బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు నాంది కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఎన్నికల తొలి బహిరంగ సభలో మీ ఆశీర్వాదం కోరడానికి హుస్నాబాద్ వచ్చానని కేసీఆర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్నిపూరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.
ఇవాళ అనేక విషయాల్లో దేశానికి ఆదర్శం అయ్యాం అని కేసీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. ఎమ్మెల్యే సతీశ్ బాబు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. బ్రహ్మాండంగా మీ సేవ కోసం పని చేస్తున్నారు. 60 వేల భారీ మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం ఉంది. హుస్నాబాద్ గెలుపు.. 95 నుంచి 100 సీట్లు గెలిచచేందుకు నాంది కావాలి. ఈ తొలి బహిరంగ సభలో మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చాను. బ్రహ్మాండమైన మేనిఫెస్టోను ప్రకటించాం. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఉధృతంగా ప్రచారం చేయాలి. అద్భుతమైన విజయం సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ పరిస్థితి ఎట్ల ఉండేనో ఆలోచించుకోవాలని కేసీఆర్ గుర్తు చేశారు. ట్రాన్స్ఫార్మర్ కాలుడు, మోటార్ కాలుడు. వచ్చిన నాలుగు రూపాయాలు దానికే పోవుడే. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే బాయికి రూ. 2 వేల చొప్పున వసూలు చేసి తీసుకుపోయేవారు. ఇప్పుడు మోటార్లు కాలడం లేదు. ఉత్తమమైన నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.
ఒకప్పుడు హుస్నాబాద్ కరువు ప్రాంతమని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఇవాళ హెలికాప్టర్ నుంచి చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. కనుచూపు మేర పంట పొలాలు కనబడుతున్నాయి. చెక్ డ్యాంలు కట్టుకున్నాం, ప్రాజెక్టులను కట్టుకున్నాం. దేవాదుల, తోటపల్లి బ్యారేజీ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఎన్నికల తర్వాత మూడు నాలుగు నెలలు కష్టపడితే.. లక్ష ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయని సీఎం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మహాసముద్రం గండి పూర్తి చేయడంతో 10, 12 గ్రామాల్లో ఊటలు పెరిగాయని కేసీఆర్ గుర్తు చేశారు. ఒక పద్ధతిగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి భూగర్భ జలాలు పెరిగాయి. వ్యవసాయానికి అర్థం, స్థిరత్వం వచ్చింది. కంటి నిండా రైతు నిద్ర పోతున్నారు. కడుపు నిండా కరెంట్.. కల్లాల నిండా వడ్లు కనిపిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా, తారు రోడ్లలో ధాన్యపు రాశులతో లక్ష్మీదేవీ నాట్యం చేస్తున్నట్లు రాశులు కనబడుతున్నాయని కేసీఆర్ తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా నేరుగా గ్రామం ట్యాంకులో నీళ్లు పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి స్కీం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐదు సంవత్సరాల నుంచి నీళ్ల సరఫరా బ్రహ్మాండంగా కొనసాగుతోంది. అలా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. చిగురుమామిడి మండలం ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండే. తోటపల్లి బ్యారేజీ నుంచి నీళ్లు రావడంతో గ్రీన్ ఏరియాగా మారిపోయింది. ఇవన్నీ కూడా మీ కండ్ల ముందున్న నిజాలు అని కేసీఆర్ చెప్పారు.
హుస్నాబాద్కు కావాల్సిన పనులు రెండు మూడు ఉన్నాయి.. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత ఐదారు నెలల్లో యుద్ధప్రతిపాదన పూర్తి చేసి ఇదే హాదాలో వచ్చి నీళ్లు వదులుతాం. శనిగరం ప్రాజెక్టు ప్రధాన కాల్వ పూర్తి కావాలని కోరుతున్నారు. ఆ ప్రాజెక్టు కట్ట లీకేజీలకు మరమ్మతులు చేస్తాం. ఈ ప్రాజెక్టును కాళేశ్వరంతో కలిపాం కాబట్టి గోదావరి నీటితో పంటలు పండుతాయి. వీరభద్ర స్వామి ఆలయం బాగా ఉంది. కొత్తకొండ జాతరకు చిన్నతంలో నేను కూడా వచ్చి మిఠాయి తిన్నాను. మన జానపదులు వచ్చి కొలిచే ఆలయం అది. దాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. సిద్దిపేట – ఎల్కతుర్తి రహదారిని విస్తరించాలని కోరారు. దాన్ని కూడా పరిశీలిన చేస్తాం. ముల్కనూరులో కొత్త బస్టాండ్, ఎల్కతుర్తిలో ప్రభుత్వ కాలేజీ మంజూరు చేయిస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.