హైదరాబాద్ : ఆదివారం బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం తెలిపారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం ప్రార్థించారు.
ఈ నెల 11న ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసింది. ఆదివారం గోల్కొండ కోటపైనున్నజగదాంభిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి బోనం పూజతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ 25న సికింద్రాబాద్ (లష్కర్) బోనాలు, 26న రంగం కార్యక్రమం జరగనుంది.