CM KCR | సూట్కేసులతో వచ్చే దోపిడీ దారులు కావాలా..? నిఖార్సైన నాయకులు కావాల్నా..? నిర్ణయించాల్సింది ప్రజలేనని సీఎం కేసీఆర్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికలు అనంగనే వట్టిగానే ఆగమాగం పిచ్చొళ్లలెక్క ఓటువేయొద్దు. మనం పిచ్చొళ్లమని వాళ్లు అనుకుంటున్నరు. అందుకే సూట్కేసులు పట్టుకొనివస్తే గెలిచిపోతమని అనుకుంటున్నరు.
సూట్కేసులతో వచ్చే దోపిడీ దారులు కావాలా? జేబులో పైస లేకుంట వచ్చే సుమన్లాంటి వ్యక్తి కావాలా? మీరే నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ కోసం పేగులుతెగేదాక కొట్లాడి.. జైళ్లపాలై.. ప్రజలు అవకాశం ఇస్తే గెలిచి, ఎమ్మెల్యే పని చేసినటువంటి నిఖార్సైన సుమన్లాంటి నాయకులు కావాల్నా? ఎలక్షన్లు వచ్చేసరికి నాలుగైదు పార్టీలు మార్చేసి సూట్కేసులు పట్టుకొని వచ్చేవారు కావాల్నా ? మీరే నిర్ణయం చేయాలి’ అన్నారు.
‘ఈ ఆలోచన సరళి, ఈ పద్ధతి ప్రజలల్లో రానంత వరకు సూట్కేసుల బాపత్గాళ్లు వస్తనే ఉంటరు. నోట్లకట్టల బాపత్గాళ్లు వస్తనే ఉంటరు. వాళ్ల బలమంతా డబ్బే. ఎక్కడ కనిపించరు. ప్రజలకు ఆపతి వచ్చినాడు ఉండరు.. సంపతి వచ్చిననాడు ఉంటరు. దుఃఖం వచ్చిననాడు ఉండరు.. ఎలక్షన్లు రాంగనే వస్తరు. ఎలక్షన్లు రాంగనే ప్రేమలు కడుపుల నుంచి దేవుకొస్తయ్. మల్లయ్య మల్లయ్య ఇక రాబిడ్డ రెండు సీసలు తాగుదాందా.. ఈ ఇంట్లేమన్న లగ్గమున్నాది. నీ ఇంట్ల ఏమన్నా కార్యమున్నా ఎందుకిస్తున్నడు సీసలు. ఈ బాపత్గాళ్లను తరిమికొట్టకపోతే.. ఇది ప్రజాస్వామ్యం కాదు.. దానికి విలువ వుండదు.
ఈ జిల్లాల్లో ఇద్దరు ముగ్గురు మోపయ్యారు. ఒకడైతే పకాత్ పేకాట క్లబ్బులు పెట్టి పైసలు మందినెత్తికొట్టి సంపాదిస్తడు. అక్కడ ఇక్కడ ముంచి డబ్బులు తెచ్చి సీసాలు, అదిఇది పంచి గోల్మాల్ చేస్తున్నరు. గోల్మాల్ గోవిందం గాళ్లను ప్రజలు గోల్మాల్ చేయనంత వరకు ఇదే దరిద్రం ఉంటదని మనవి చేస్తున్నా. ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఈ శక్తి మీ చేతుల్లోనే ఉంటది. వాడు వచ్చి అడిగితే మొహమాటానికి ఆ అనాలే. కానీ, చేసేకాడ చేసే పని చేయాలి. సురుకుపెట్టేకాడ పెట్టాలి. లేకపోతే దీనికి అర్థం లేకుండాపోతుంది. ప్రజలు ఆలోన చేయకపోతే పెద్ద ప్రమాదం వస్తుంది’ అంటూ హెచ్చరించారు.