CM KCR | కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. కోదాడ సభలో పాల్గొన్న ఆయన.. రైతుబంధుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఉత్తమ్ కుమార్రెడ్డి జిల్లాలో పెద్ద నాయకుడు. ఆయన ఎంత బుద్ధిమంతుడంటే.. ప్రజలు కట్టే అమూల్యమైన ట్యాక్సులను రైతుబంధు ఇస్తున్నడు.. అది వేస్ట్ అని మాట్లాడుతున్నడు. రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క, ఘనత వహించిన పీసీసీ అధ్యక్షుల వారు చెబుతున్నరు మేం గెలిచిన తెల్లారి ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారు. ధరణిని తీసివేస్తే రైతుబంధు డబ్బులు ఎలా రావాలి? బీమా సొమ్ము రావాలి? వరిధాన్యం డబ్బులు ఎలా రావాలి? ఇవాళ ఎట్లా వస్తున్నయ్.. ఎక్కడ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ కార్యాయాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడ బ్యాంకులు డబ్బులు వేయగానే.. టింగు టింగుమని డబ్బులు జమవుతున్నయ్. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అదే పద్ధతిలో వస్తున్నయ్. అదృష్టం బాగా లేక ఎవరైనా రైతు చనిపోతే బీమా సొమ్ము వారం తిరగక ముందే ఇంటికి ముందుకు వస్తున్నయ్’ అన్నారు.
‘గతంలో ఆపద్బంధు కాంగ్రెస్ రాజ్యంలో పెట్టారు. రూ.50వేలు పెడితే.. చెప్పులు అరిగేలా ఆరు నెలలు తిరిగినా రూ.5-10వేలు జేబులో పెట్టిపంపారు. ఇవాళ ఉన్న రైతుబంధులా లేకుండే. మరి సదుపాయాలన్నింటిని ఎవరు అడిగారు ? రైతుబీమా కావాలని అడిగారా? మా ధాన్యం కొనాలని ఎవరైనా అడిగారా? తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త సంసారాన్ని ఏ విధంగా అయితే తీర్చిదిద్దాలో.. ఏం ఏం అవసరాలున్నాయో.. మంచినీళ్ల బాధ ఏంది.. రైతుల బాధల ఏంటీ. పేదల బాధలు ఏంటీ? గతంలో రూ.70, రూ.200 పెన్షన్ చూడలేదా? నేను మొన్ననే ప్రకటించినా.. రూ.5వేలు చేస్తామని చెప్పాం. రాష్ట్ర ఆదాయాన్ని బట్టి పెంచుకుంటూ పోతున్నాం. రైతుబంధు సైతం ఆదరాబాదరగా ఇవ్వలేదు. మొదలు పెట్టినప్పుడు రూ.4వేలు పెట్టుకున్నాం. ఆ తర్వాత రూ.5వేలు పెంచుకున్నాం. సంవత్సరానికి కొంచెం పెంచుకుంటూ రూ.16వేలకు పెంచుకుంటామని చెప్పాం. ఉత్తమ్ కుమార్రెడ్డి రైతుబంధు వేస్ట్ అంటున్నడు. జగదీశ్వర్రెడ్డి, మల్లయ్యాదవ్, కేసీఆర్ రైతుబంధు ఇవ్వాలి అంటున్నరు.. మరి ఎవరు కావాలి? పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ కోసం తపనతో పని చేస్తున్న పార్టీ బీఆర్ఎస్’ మాత్రమేనన్నారు.
‘తెలంగాణ కంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నయ్. వాళ్లందరినీ తలదన్ని ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా? లేదా? అనేదానికి ఒకే పదం చూపిస్తుంది. ఆ రాష్ట్రంలో, దేశంలో తలసరి ఆదాయం ఎంత? తలసరి విద్యుత్ వినియోగం ఎంత ? ఇదే ప్రధానమైంది. అంతర్జాతీయలో ఇదే ఉంటది. ఇవాళ భారత్లో 3.18లక్షలతో తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్గా ఉన్నది. కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం ఎంత ? ఈ నాడు ఎంత? ఆ నాడు విద్యుత్ వినియోగం 1100 యూనిట్లు.. జగదీశ్వర్రెడ్డి విద్యుత్ మంత్రి హయాంలో 2200 యూనిట్లు. మరి ఈ సదుపాయాలన్నీ కోల్పోదామా? ఈ సభలో ఉన్న వారందరినీ కోరుతున్నా. కోదాడ బీసీ చైతన్యం, బలహీన వర్గాల చైతన్యం, కోదాడ దళితుల చైతన్యం, ముస్లింల చైతన్యం..లంబాడ చైతన్యం ఈ ఎన్నిక ద్వారా బయటపడాలి. మల్లయ్య యాదవ్ని ఓడగొట్టాలని బాగా బలిసిన వాళ్లు ఒక్కటై కుట్రలు చేస్తున్నరు.. ఆ కుట్రలు ఓడిపోవాలా? మల్లయ్య యాదవ్ ఓడిపోవాలా.. మీరు ఆలోచించాలి. యువత అంతా ప్రతి ఇంటికి చేరుకొని నవంబర్ 30 వరకు ఎట్టి పరిస్థితుల్లో చైతన్యాన్ని కాపాడాలి. ప్రతి ఒక్క ఓటరుని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి మల్లయ్య యాదవ్కు ఓటు వేయించాలి’ అని పిలుపునిచ్చారు.
‘భవిష్యత్లో సూర్యాపేట జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన దగ్గర పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతున్నయ్. వాటన్నింటిని పంపేందుకు ఇక్కడి నుంచి మచిలీపట్నం దగ్గర. ఈ ప్రాంతంలోనే వేలాది ఎకరాల్లో డ్రై పోర్ట్స్ రాబోతున్నాయ్. అద్భుతమైన అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఏ బీఆర్ఎస్ అయితే, తెలంగాణ సాధించింది.. చావు నోట్లో తలకాయపెట్టి చివరకు కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని శపథం చేసి ఎట్లయితే పోరాటం చేసి తెచ్చుకున్నామో అలాగే అభివృద్ధి చేసుకుందాం.. అన్ని వర్గాల మొఖాలపై చిరునవ్వులు రావాలి. యాదవులు కోసం ఆలోచించి.. గొర్రెలను పంపిణీ చేశాం. దళితుల సంక్షేమం కోసం రైతుబంధును తీసుకువచ్చాం. దళితులు, ముస్లింలను ఓటుబ్యాంకు కోసం వాడుకున్న పార్టీ ఏదీ ? భారతదేశంలో దళితుల బతుకలను బాగు చేయాలని ఎవరైనా ఆశించారా? వారి కోసం దళితబంధును తీసుకువచ్చాం. అందరికీ న్యాయం జరిగే వరకు కార్యకమం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.