హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. ఖమ్మం పట్టణంలో సూర్యాపేట-అశ్వారావుపేట మార్గంలో ఉన్న మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావ తొలి భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మరుసటిరోజే నిధులు విడుదలయ్యాయి. మున్నేరు వాగుపై అత్యాధునిక పద్ధతిలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 420 మీటర్ల పొడవున నిర్మించనున్న ఈ కేబుల్ వంతెన 300 మీటర్లు కేబుల్పై నిలువనుండగా, మిగిలిన 120 మీటర్లు ఆర్సీసీతో నిర్మించనున్నారు.
ఖమ్మంలోని నయాబజార్ వద్ద మున్నేరు వాగుపై దశాబ్దాల క్రితం నిర్మించిన అతి తక్కువ వెడల్పుగల వంతెనే రాకపోకలకు ఆధారంగా ఉన్నది. వరంగల్ వైపునుంచి ఖమ్మం పట్టణానికి వచ్చే వాహనాలు కూడా ఈ వంతెన గుండానే ప్రయాణించాల్సి వస్తున్నది. కేవలం 20 అడుగుల వెడల్పు ఉండే ఈ వంతెన ప్రస్తుత ట్రాఫిక్కు ఏమాత్రం సరిపోవడంలేదు. ఖమ్మం పట్టణం భారీగా విస్తరించడం, సూర్యాపేట-అశ్వారావుపేట మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో ఈ వంతెనపై నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతున్నది. తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. మున్నేరు వాగుపై వంతెన నిర్మించాలని సీఎం కేసీఆర్కు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇటీవల విజ్ఞప్తిచేశారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలోనే ఖమ్మం మున్నేరు వాగుపై రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. త్వరలోనే వంతెన నిర్మాణానికి అవసరమైన డిజైన్లు రూపొందించి, టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.