CM KCR | నిర్మల్ : నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇవాళ నిర్మల్ జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా నిర్మల్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నాం. కలెక్టరేట్ను ప్రారంభించాం. సంతోషంగా ఉంది. నిర్మల్ జిల్లాలో 396 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు కూడా ప్రత్యేకంగా రూ. 10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నాం. అదే విధంగా నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున ప్రకటిస్తున్నాం. ఇవి కాకుండా నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్ ప్రకటించారు.
ఇటీవల విడుదలై పదో తరగతి ఫలితాల్లో మొత్తం తెలంగాణలోనే నిర్మల్ జిల్లా నంబర్ వన్గా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. నిర్మల్ జిల్లా టీచర్లను, విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో పునాది రాయి కోసం రాబోతున్నాం. అద్భుత ఆలయం నిర్మించుకుందాం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు మారుమూల జిల్లా, అడవి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. మన ప్రభుత్వం ప్రారంభించినటువంటి పేదల కోసం నిర్మించే 2 వేల డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకస్థాపనం చేశాం. పేదవాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.