CM KCR | హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి గమ్య నిర్దేశం చేసే స్థాయికి చేరిందని, దారిదీపంగా మారిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమని తెలిపారు. జూన్ 2న (శుక్రవారం) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు పదో రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజలకు సంతోషకరమైన రోజని, వాడవాడలా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం పదో వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలను, అధిగమించిన అడ్డంకులను సీఎం కేసీఆర్ యాది చేసుకొన్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ, ప్రజలను మమేకం చేస్తూ, మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును గుర్తు చేసుకొన్నారు. తెలంగాణవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, వేలాది సభలను నిర్వహిస్తూ, సబ్బండ వృత్తులను సకల జనులను సమీకరిస్తూ, సమన్వయ పరుస్తూ ముందుకు సాగిన తీరును నెమరువేసుకొన్నారు. అందరి భాగస్వామ్యం, సహకారంతో, శాంతియుత పద్ధతిలో పోరాటం కొనసాగించి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియను, ఈ క్రమంలో సహకరించిన వారందరినీ సీఎం కేసీఆర్ మరోసారి యాది చేసుకొన్నారు. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే పంథాను అనుసరించి నిర్దిష్ట కార్యాచరణతో విజయతీరాలకు చేరిన మొత్తం ఉద్యమ ప్రస్థానాన్ని సీఎం స్మరించుకొన్నారు.
సరిగ్గా తొమ్మిదేండ్ల క్రితం 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలను, ప్రత్యర్థుల కుయుక్తులను దాటుకొని నిలదొకుకోవడం అత్యద్భుతమని సీఎం అన్నారు. ఒకప్పుడు వెనకబాటుకు గురైన తెలంగాణ… నేడు సమస్త రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పుడు దేశం మొత్తం ‘తెలంగాణ మాడల్’ను కోరుకొంటున్నదని, తెలంగాణ తరహా పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని, ఈ దిశగా దేశ ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని సీఎం పేరొన్నారు.
వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థికం తదితర సమస్త రంగాల్లో తెలంగాణ గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకొన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాలపాటు అంగరంగ వైభవంగా, పండుగలా జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందరకర సమయంలో తమ సంతోషాలను పంచుకొంటూ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.