CM KCR | ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువైందని సీఎం కేసీఆర్ అన్నారు. వజ్రాయుధంలాంటి ఓటును ఉల్టా వినియోగిస్తే కిస్మత్ను బదలాయిస్తుందని.. భవిష్యత్ను కిందమీద చేస్తుందని ప్రజలను హెచ్చరించారు. బాల్కొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను చెప్పే నాలుగుమాటలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఏది నిజమో కాదో తేల్చాలి. ఓటు అనేది.. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీ దగ్గరున్న విలువైన వజ్రాయుధమే ఓటు. దాన్ని ఉల్టా వినియోగిస్తే మీ తలరాతను కిందమీద చేస్తుంది. ఐదేళ్ల భవిష్యత్తు కిందిమీది చేస్తుంది. ఓటు కిస్మత్ను బదలాయిస్తుంది కాబట్టి.. రాష్ట్ర పరిస్థితులను బదలాయిస్తుంది కాబట్టి తమాషా కోసం వేయొద్దు. మా చిన్నయ్య చెప్పిండు.. మా బామ్మద్ది చెప్పిండు.. మా కులపోడు చెప్పిండు.. మా వాడకొట్టోడు చెప్పిండని ఓటు వేయొద్దు’ అంటూ సూచించారు.
‘ఎవరికి వారు ఎక్కడికక్కడ చర్చ చేసి నిర్ణయానికి రావాలి. ఆ చర్చ జరి ఓటువేసే కాలం వచ్చిన నాడు గ్యారంటీగా నాయకులు కాదు ప్రజలు గెలుస్తారు. ఆ ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం. ఆ పరిణితి ఈ దేశంలో రావాలని ఆ భగవంతున్ని కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆ పార్టీ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏకబిగిన 50 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్లు చేసిననాడు మనం చూడలేదు. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతున్నది ఒక్క ఛాన్స్ అంటున్నది. మీకు 11 సార్లు ఛాన్స్లు ఇచ్చారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే పంటికంటకుండా మింగుతరా? ఏం కారణం? అని ఆలోచన చేయాలి. వైఖరేంటో గమనించాలి. ఏం మాట్లాడుతున్నారు.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోన చేయాలి. అప్పుడే నిజానిజాలు తేలుతయ్. బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది’ అన్నారు.
‘ప్రశాంత్రెడ్డి కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. అప్పుడేం జరిగింది.. ప్రశాంత్రెడ్డి కాలంలో ఏం జరిగిందో మీ కండ్ల ముందే ఉందని మనవి చేస్తున్నా. 18 సబ్స్టేషన్లు కట్టిండు. 45 ట్రాన్స్ఫార్మర్లు తెచ్చిండు. మళ్లీ మూడు కావాలని మొదలుపెట్టిండు దుకాణం. గత చరిత్రలో నేను కూడా ఎమ్మెల్యేగా సిద్దిపేటలో ఉండేది. ఒక్క సబ్స్టేషన్ కావాలంటే మూడేళ్లు తిరిగేది. కాంగ్రెస్ రాజ్యంలో ట్రాన్ఫార్మర్లు, కరెంటు మోటార్లు కాలుతుండే. సగం రాత్రి కరెంటు.. సగం పొద్దాక కరెంటు.. పాముకాట్లు, కరెంటు షాక్లు ఉంటుండే.
ట్రాన్స్ఫార్మర్ కాలితే బోరుకు రూ.2వేలు జమ చేసుడే ఉండే. మళ్లీ ఆ రాజ్యమే రావాల్నా. మళ్లీ తెల్లందాక.. పొద్దాక కరెంటు కావాలా? అదే ఆలోచన చేయాలని కోరుతున్నా. అన్నం ఉడికిందా లేదా? అంటే కుండంత పిసకాల్సిన అవసరం లేదు. టీవీలు చూస్తున్నరు.. పేపర్లు చదువుతరు చర్చ చేస్తరు. సెల్ఫోన్ల యుగం ఇది. ఎక్కడ ఏం జరిగిన న్యూస్ వస్తుంది. ఇండియాలో మనది చిన్న రాష్ట్రం. పదేళ్ల వయసుమాత్రమే ఉన్న రాష్ట్రం. పెద్ద పెద్ద రాష్ట్రాలున్నాయ్. భారతదేశం మొత్తంలో ఒక్కరాష్ట్రం కూడా 24గంటల కరెంటు ఇవ్వదు. ఒక తెలంగాణనే ఇస్తుంది’ అని తెలిపారు.