వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే మందులు అందజేయాలి. గోదావరికి వరద పెరిగినందున వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలి.
– సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం కూడా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పరిస్థితిని పర్యవేక్షించారు. వరద ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను తెలుసుకొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సీఎం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లు ద్వారా ఆహారం, తాగునీరు, మందులను అందించేలా సీఎస్, ఉన్నతాధికారులు చర్యలు తీసుకొంటున్నారు.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వరదలు ఇంకా కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో అన్ని శాఖలను సమన్వయం చేసుకొంటూ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు కాలనీలు, మూసీ పరీవాహక ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేశారు.
ముంపునకు గురైన ప్రాంతాల్లో వైద్య సేవలపై మంత్రి హరీశ్రావుకు సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే వైద్యశాఖలో ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిమగ్నమయ్యేలా చర్యలు తీసుకొన్నారు. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్న మంత్రి హరీశ్రావు.. దవాఖానలు, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య పరీక్షలు, మందులు సరఫరా పరిస్థితిని సీఎంకు వివరించారు.
గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుండటంతో భద్రాచలంలో పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు సీఎం కేసీఆర్ ఫోన్చేసి పరిస్థితి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలతో భద్రాచలం ప్రాంతంలో మంత్రి ఏరియల్ సర్వే చేశారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నామని సీఎంకు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద నష్టాన్ని అంచనావేస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరావాస పనులు చేపట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ను సీఎం ఆదేశించారు. దీంతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే గుండ్లవాగుపై రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
ఇరిగేషన్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు
ఎగువ నుంచి గోదావరికి వరద పెరగడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. ఈ నేపథ్యలో వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పలు ప్రాజెక్టుల ఈఎన్సీలకు, చీఫ్ ఇంజినీర్లకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ.. జలాశయాల నుంచి నీటిని కిందికి వదలాలని చీఫ్ ఇంజినీర్లకు ఆదేశాలిచ్చారు.