CM KCR | మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించారు. మరో రెండు, మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం కూడా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితిని మంత్రులు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు, సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 12 గంటలు ఈ సమీక్ష సాగింది. ఈ సమీక్షలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అంజయ్య యాదవ్, కృష్ణ మోహన్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి, నోముల భగత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, పీసీపీఎఫ్ డోబ్రియాల్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా వుండాలన్నారు. రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై మంత్రులు, ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ ఆరా తీశారు. వరద ముప్పు గల జిల్లాల అధికారులతో మాట్లాడి, పరిస్థితులను అంచనా వేశారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. సమాచారాన్ని స్క్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేశారు. వరద పెరగడంతో రిజర్వాయర్లకు చేరే బ్యాక్ వాటర్తో ముంపుకు గురికాకుండా చూసుకోవాలని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావుకు సీఎం సూచించారు.
మరో వారం, పది రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నదని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అధికారులకు సహకరిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దన్నారు. వరదల నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతోపాటు జీహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్లు సహా హెలికాప్టర్లను సిద్ధం చేసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు. గత రెండురోజులుగా వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన రక్షణ చర్యలను సీఎం కేసీఆర్కు అధికారులు వివరించారు. నిజామాబాద్, ములుగు రామన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా,పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెప్పారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణహిత, ఇంద్రావతి, వంటి గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించడంతో మంగళవారం కూడాపరిస్థితులను ఎప్పడికప్పుడూ పర్యవేక్షించాలని భద్రాచలంలో బస చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భద్రాచలంలో వరద పరిస్థితి ఆరా తీశారు.
వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు వారి వారి జిల్లా కేంద్రాలు స్థానిక ప్రాంతాలను విడిచి ఎక్కడికి వెళ్లొద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని సీఎం ఆదేశించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గడ్డెన్న వాగు, స్వర్ణ వాగుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 శాతం నిర్వహిస్తూ అధిక వరదను ఎప్పటికప్పుడు కిందికి వదిలేలా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం సూచించారు.