హైదరాబాద్ : ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలోగా రోడ్ల మరమ్మత్తుల పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తుల కోసం వారం రోజుల్లోగా టెండర్లు పిలిచి పూర్తి చేయాలన్నారు. రోడ్ల నిర్వహణ పూర్తి బాధ్యత రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలదే అని సీఎం స్పష్టం చేశారు. రోడ్లపై గుంతలు లేకుండా నిరంతరం నిర్వహణ చేపట్టాలి. వరదలకు పాడైన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పరిమాణం నానాటికి పెరుగుతోంది. రాష్ట్రంలో గుణాత్మక అభివృద్ధికి అనుగుణంగా సిబ్బంది ఉండాలి. క్షేత్ర స్థాయిలో మరింత మంది ఇంజినీర్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి ఐదు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్ఈ ఉండేలా చూడాలి. ప్రభుత్వానికి నివేదిక ఇస్తే వచ్చే మంత్రివర్గ భేటీ ఆమోదించే అవకాశం ఉంటుందన్నారు.
ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించారు. పాడైన రోడ్లకు మరమ్మత్తులు, బాధ్యతల వికేంద్రీకరణపై చర్చించారు. రోడ్డు పనుల్లో నాణ్యత పెంచే చర్యలపై అధికారులతో కేసీఆర్ సమీక్ష చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోడ్ల మరమ్మత్తులకు త్వరలోనే టెండర్లు పిలిచి సంబంధిత పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు కేజ్ వీల్స్తో రోడ్లపై ప్రయాణించడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని అధికారులు ప్రస్తావించారు. రైతులకు, ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు.