హైదరాబాద్ : ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా అమలులోకి వచ్చిన స్వయం పాలనలోని ప్రగతి సమిష్టి కృషికి నిదర్శనమని సీఎం స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో ఒక్కొక్క రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టండంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఇమిడి వున్నదన్నారు. సాధించిన దానికి సంతృప్తి చెంది ఆగిపోకుండా ఇంకా గొప్పగా ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిన నాడే గుణాత్మక ప్రగతిని మరింతగా ప్రజలకు చేరవేయగలుగుతామని ప్రభుత్వాధికారులకు సీఎం పునరుద్ఘాటించారు.
రోటీన్గా అందరూ పనిచేస్తరు కానీ మరింత గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే ముఖ్యం. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పని చేయగలమని ప్రతిరోజు ఆలోచించాలె. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా జీవించి, రసించి, ఆలోచించి చేస్తున్నం అనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం. మూస ధోరణులను సాంప్రదాయ పద్దతులలో కాకుండా వినూత్న పద్ధతుల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. అందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాల్సి వుంటుందని అధికారులకు కేసీఆర్ వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్షతో పాటు నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్నిసుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరమున్నది. తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజలకు అందాల్సిన నాణ్యమైన సౌకర్యాల కోసం అందరం కలిసి పని చేయాలి. ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేని సందర్భాల్లోంచి నేడు అన్ని రంగాల్లో గుణాత్మకాభివృద్ధిని తెలంగాణ సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజల అనుభవంలోకి వచ్చాయని కేసీఆర్ తెలిపారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా ప్రగతిని సాధించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. తదనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నేడు ఆర్థికంగా బలపడుతున్నాయి. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి ద్వారానే.. ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. తద్వారా ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. వారికి మరింత నాణ్యమైన, ఉత్తమమైన సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులమీదనే వున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
పౌర సౌకర్యాల పెంపు కోసం రోజు రోజుకూ డిమాండు పెరుగుతుందంటే, మన ప్రభుత్వం మీద ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని సీఎం అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన అవసరమున్నదని ఉద్యోగులతో కేసీఆర్ అన్నారు.
ఒక నాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానలు తదితర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా వుంటున్నాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ నుంచి బయటకు పోయిన వలసలు నేడు రివర్సయినయి. దాదాపు 30 లక్షల మంది పక్క రాష్ట్రాలనుంచి తెలంగాణకు వలసొచ్చి బతుకుతున్న పరిస్థితి వున్నది. స్వరాష్ట్రంలో రాబడులు పెరిగి ఆర్థిక వనరులు పెరిగాయి. పరిపాలనా సంస్కరణలతో గడప గడపకూ పాలనను తీసుకపోతున్నం. ప్రభుత్వం కృషితో అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణలో అన్ని శాఖలల్లో పని పరిమాణం పెరిగింది. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమాన స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి వుంటదని సీఎం స్పష్టం చేశారు.
ప్రజల ప్రాథమిక అవసరాలను, నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వ ఉద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన నాటికి ఉమ్మడి పాలనలో శిథిలమై వున్న అన్ని రంగాలను తీర్చిదిద్ది నేడు వాటిని ఒక ట్రాక్ మీదకు తీసుకురాగలిగామని సీఎం తెలిపారు. ప్రారంభ దశలో వున్న ఆందోళన ఇప్పుడు లేదన్నారు. అన్ని రంగాలు వాటంతంట అవి పని చేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
గతంలో వానాకాలం రెండు మూడు నెలలు మాత్రమే వుంటుండే అని కేసీఆర్ గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. నిత్యం వానలతో నిర్మాణాత్మక పనుల నిడివి కూడా తగ్గింది. వర్షాలు లేని ఆరేడు నెల్ల కాలంలోనే మనం అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోవాల్సి వున్నది అని సీఎం తెలిపారు.