CM KCR | అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. హైదరాబాద్ గోపనపల్లిలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నెల 31న ‘తెలంగాణ బ్రాహ్మణ్ సదన్’ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు, సభ్యులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చండీయాగం, సుదర్శన యాగం నిర్వహణ, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులకు చేయాల్సిన ఏర్పాట్లపై సీఎం అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశంలో పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి, ఉపాధ్యక్షుడు వనం జ్వాలా నరసింహారావు, సభ్యులు సముద్రాల వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వీ మృత్యుంజయ శర్మ, పురాణం సతీశ్, మరుమాముల వెంకట రమణ శర్మ, బోర్పట్ల హనుమంతా చారి, అష్టకాల రామ్మోహన్, భద్రకాళి శేషు, సుమలతా శర్మ, సువర్ణ సులోచన, జోషి గోపాల శర్మ, పరిషత్ సభ్య కార్యదర్శి వీ అనిల్ కుమార్, పాలనాధికారి రఘురామశర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అర్చక పౌరహిత్యమే జీవనాధారంగా చేసుకుని, నిత్యం భగవత్ సేవలో నిమగ్నమవుతూ, సమస్త లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉన్నదని సీఎం అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధామ్యంగా ఎంచుకుని పలు పథకాలు అమలు చేయడం వెనక ఇదే తాత్వికత ఇమిడి ఉన్నదని ముఖ్యమంత్రి తెలిపారు. నేడు తెలంగాణ ఆధ్యాత్మిక తెలంగాణగా మారిందని, దేవాలయాల పునరుజ్జీవంతో రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయన్నారు.
దాంతో ఇతర రాష్ట్రాలనుంచి తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కోసం అర్చకులు పురోహితులు వేద పండితులు వలస వస్తున్నారని సీఎం తెలిపారు. అన్నివర్గాలతో పాటు నేడు తెలంగాణ బ్రాహ్మణులకు ఉపాధి కేంద్రంగా మారిందన్నారు. బ్రాహ్మణ సమాజానికి భరోసా దొరికిందన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుతెన్నులను సీఎం కేసీఆర్కు పరిషత్ అధ్యక్షుడు వివరించారు. సంక్షేమ పరిషత్ ఏర్పడిన నాటినుంచి నేటి వరకు సుమారు 6500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు.
కాగా, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు అదనంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను పేద బ్రాహ్మణులకు ఆసరా అందించేలా రూపొందించాలని సీఎం అన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని పరిషత్ సభ్యులకు సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సమగ్రరీతిలో సమస్త ఆధ్యాత్మిక ధార్మిక సమాచార కేంద్రంగా పరిఢవిల్లాలని సీఎం ఆకాంక్షించారు. ఆధ్యాత్మాక సాహిత్యానికి, క్రమతువులకు సంబంధించిన సమాచారాన్ని దేశం నలుమూలల నుంచి సేకరించి పుస్తకాలు, డిజిటల్ రూపంలో భద్రపరచి అందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు.