హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఈ క్రమంలో రైతులకు సీఎం కేసీఆర్ ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొంటామని సీఎం స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష సందర్భంగా వరి ధాన్యం కొనుగోళ్లపై కూడా కేసీఆర్ ఆరా తీశారు.
వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతితో పాటు పలు విషయాలను అధికారులను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా.. తడిసిన ధాన్యంతో పాటు చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్ను కూడా ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ఉద్ఘాటించారు.