హైదరాబాద్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణే ధ్యేయంగా కీలక సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ శుక్రవారం జరగనుంది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, డీజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖకు చెందిన ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాట కూడా వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వినియోగంలో దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యాచరణకు అనుగుణంగా పోలీస్, ఎక్సైజ్ శాఖల యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు.
మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కఠిన చర్యల అమలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మందితో కూడిన ప్రత్యేక ‘నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డిని ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం డీజీపీ ఆధ్వర్యంలో, డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.