హైదరాబాద్ : గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా.. ఆయన బోధనలను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని అన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉందని, గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని పేర్కొన్నారు.
కృష్ణానది ఒడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జున సాగర్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ‘బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి, జాతికి అంకితం చేసిందని చెప్పారు. బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనున్నదన్నారు. సర్వ జన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుని మార్గంలో తెలంగాణ ప్రభుత్వం పయనిస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.