హైదరాబాద్ : అనాటి ఘోరమైన పరిస్థితుల్లో ఒంటరిగా బయల్దేరి, చిత్తశుద్ధితో మొండిగా ప్రయత్నిస్తే ఇవాళ తెలంగాణ సాధ్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సాధ్యం కావడమే కాదు అద్భుతాలు ఆవిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రమణకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమణతో పాటు టీఆర్ఎస్లో చేరిన వారిని ఉద్దేశిస్తూ సీఎం ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
అందరు తట్ట, పార కిందపెట్టి ఇక కాదులే అని చెప్పి నిరాశకు గురైన సమయంలో ఒక స్పష్టమైన అవగాహనతోని తెలంగాణ కోసం తాను ఒంటరిగా బయల్దేరినట్లు చెప్పారు. ఆ రోజు ఎటువంటి అధికారం ఉన్న పెద్దల్ని ఎదుర్కొని, ఎటువంటి ఛాలెంజ్ తీసుకుని బయల్దేరిన్నో అందరికీ తెలుసన్నారు. దానికి కేవలం గుండెధైర్యం తప్పా మరోటి కాదన్నారు. ఆ రోజుల్లో ఎటుచూసినా కారు చీకటి. తాను కనపడితే స్నేహితులు కూడా సందులకి పోతుండే. వీనితోని మాట్లాడితే అక్కడ తెలుస్తదేమో అని. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఒంటరిగా బయల్దేరితే, మొండిగ ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ సాధ్యం కావడమే కాదు అద్భుతాలు ఆవిష్కరిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.