హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లు విడుదల చేసింది. ఇందుకు గిరిజన, ఆదివాసీల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు, రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో అతిపెద్ద గిరిజన, ఆదివాసీ జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నదన్నారు.
కరోనా కష్టకాలం వల్ల బడ్జెట్ సమస్యలు ఉన్నా వచ్చే ఏడాది జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరకు రూ.75 కోట్లు విడుదల చేయడం గిరిజన, ఆదివాసీలు, వారి ఆచారాలు, పండగలు, జాతరల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనమని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని వర్గాల పండగలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. అన్ని కులాలు, మతాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి, వారి పండగలు జరిపేందుకు నిధులు కేటాయించి, సెలవులు ప్రకటించి, అధికారికంగా నిర్వహిస్తూ తమ ప్రభుత్వం అన్ని వర్గాలను గౌరవిస్తున్నదన్నారు.
గత ఏడాది కూడా రూ.75 కోట్లు, అంతకుముందు రూ.100 కోట్లు సమ్మక్క – సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు అన్నిరకాల వసతుల కల్పనకు ఏర్పాట్లు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఇప్పటికే అనేక శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలతో మేడారంలో భక్తుల కోసం ఏర్పాట్లు చేశామని సత్యవతి రాథోడ్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16-19 మధ్య జరిగే జాతర కోసం వారం క్రితం రూ.2.24 కోట్లతో డ్రెస్సింగ్ రూమ్లు, ఓహెచ్ఆర్ఎస్, కమ్యునిటీ డైనింగ్ హాల్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు.
ప్లాస్టిక్ రహితంగా ఈ జాతర నిర్వహణకు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో అన్ని ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికలతో అధికారులు పనులు చేపడుతున్నారన్నారు. అత్యంత చారిత్రక ప్రాశస్త్యం గల అతిపెద్ద ఆదివాసీ జాతరకు సీఎం కేసీఆర్ రూ.75 కోట్లు విడుదల చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.