హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక హెలికాప్టర్లో యాదాద్రి చేరుకున్నారు. కాసేపట్లో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభం కానుంది. కేసీఆర్ కుటుంబ సమేతంగా స్వయంభువుల తొలి పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:10 గంటలకు ఆలయ ప్రవేశం జరగనుంది. స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటల సమయంలో హైదరాబాద్కు సీఎం తిరిగి పయనమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.