హైదరాబాద్, ఆగస్టు 6, (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు.
శ్రీ నరేంద్ర మోదీజీ..
కేంద్ర ప్రభుత్వం, రాష్ర్టాలను ఏకతాటిపైకి తెచ్చి నిజమైన సహకార సమాఖ్య స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సమానమైన అభివృద్ధిని సాధించాలనే సమోన్నత లక్ష్యంతో నీతి ఆయోగ్ ప్రారంభమైంది. సహకార సమాఖ్య స్ఫూర్తి ద్వారా కేంద్రాన్ని, రాష్ర్టాలను ఏకంచేసి ‘టీమ్ ఇండియా’గా మార్చడంతోపాటు భారత్ బలమైన దేశంగా ఎదిగేలా చేయడమే ఇందులో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సూత్రం. అంతేకాదు.. బలమైన రాష్ర్టాలే బలమైన దేశాన్ని తయారు చేయగలవన్న వాస్తవాన్ని గ్రహించడం కూడా నీతి ఆయోగ్ ఏర్పాటు వెనుక ఉన్న మరో ఆలోచన.
కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అసహ్యకర పరిణామాలను పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని క్రమపద్ధతిలో క్షీణింపజేస్తున్నదని అర్థమవుతున్నది. ఈ పరిణామాలు తెలంగాణ వంటి రాష్ర్టాలను చాలా నిరుత్సాహ పరుస్తున్నాయని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా జరిగిన కేటాయింపుల విషయంలో కొన్ని రాష్ట్రాలపై కఠోర వివక్ష ప్రదర్శించడం అత్యంత బాధాకరం.
నీతి ఆయోగ్ మొదట్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రతిపాదనల కోసం ముఖ్యమంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలకు సంబంధించి వీరు ప్రధాన సిఫారసు సూచించారు. ప్రజలకు గరిష్ఠంగా ప్రయోజనాలు అందించేందుకు స్థానిక అవసరాలు, నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మార్పులు, చేర్పులు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలని సూచించారు. అన్ని పథకాలను, విధానాలను ఢిల్లీలోని మేధావులే రూపొందించరాదని, రాష్ర్టాల్లోని భిన్నత్వం, వారి విభిన్న ప్రత్యేక అవసరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకొని ప్రయోజనాలు అందిచాలనేది ఈ సిఫారసు యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇంతటి ముఖ్యమైన సిఫారసును కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని చాలా బాధతో, వేదనతో చెప్పాల్సి వస్తున్నది. అంతేకాదు.. కేంద్రం ఈ సిఫారసులకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తూ రాష్ర్టాల నిర్దిష్ట అవసరాలను పక్కనబెట్టి పథకాలను సంకుచితంగా నిర్వహిస్తున్నదని నేను గుర్తించాను. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలోనే కాదు.. నీతి ఆయోగ్ సిఫారసులను సైతం నిర్దంద్వంగా పక్కనబెట్టిందని కింద పేర్కొన్న విషయాలు స్పష్టం చేస్తాయి.
పక్కదారి పట్టిన లక్ష్యాలు
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని తయారు చేస్తాయని గుర్తించి సహకార సమాఖ్య స్ఫూర్తితో నీతి ఆయోగ్ ప్రారంభించబడిందని నేను అంగీకరిస్తాను. కానీ దాని ఏడేండ్ల పనితీరును చూసిన తర్వాత దాని మహోన్నతమైన లక్ష్యాలన్నీ ఉల్లంఘించబడ్డాయని స్పష్టమైంది. దేశాభివృద్ధి ఎజెండాలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను సమాన భాగస్వాములుగా చేర్చకపోవడం వల్లే లక్ష్యాలన్నీ పక్కదారి పట్టాయని స్పష్టంగా అర్థమవుతున్నది.
నీతి అయోగ్ సమావేశాల ఎజెండా తయారీలో రాష్ట్రాల సహకారం తీసుకోవడం లేదు. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు వార్షిక ప్రణాళికలు రూపొందించే సమయంలో రాష్ట్రాలతో వివరణాత్మక చర్చలు జరిపేది. ఇప్పుడు ఒక ప్రణాళిక లేదు.. రాష్ట్రాల ప్రమేయం లేదు.. అంతేకాదు నీతి ఆయోగ్ సమావేశాలు ఎలాంటి నిర్మాణాత్మక ప్రయోజనాలను అందించవని స్పష్టంగా అర్థమవుతున్నది. నీతి ఆయోగ్ యొక్క సంక్లిష్టమైన సమావేశాల ప్రక్రియ అర్ధవంతమైన చర్చలకు అతి తక్కువ అవకాశం ఇస్తున్నది. ఎందుకంటే సమావేశంలో పాల్గొనే ముఖ్యమంత్రులు మాట్లాడటానికి మరియు వారి అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తున్నారు. తద్వారా ఏదైనా అంశంపై వివరంగా చర్చించడానికి ఎటువంటి అవకాశం ఉండటం లేదు.
స్పష్టమైన ప్రణాళిక లోపం, సహకార సమాఖ్య స్ఫూర్తి లేకపోవడం వల్ల దేశం రూపాయి విలువ అనూహ్యంగా పడిపోవడం, అధిక ద్రవ్యోల్బణం, ఆకాశాన్నంటుతున్న ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరగడం వంటి దారుణమైన సమస్యలతో దేశం అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నది. ఈ సమస్యలు ప్రజల జీవితాలను అత్యంత ప్రభావితం చేయడంతోపాటు దేశం పట్ల ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ నీతి ఆయోగ్ సమావేశాల్లో వీటిపై ఎలాంటి చర్చ జరగలేదు. తీవ్ర సంక్షోభం ముంచుకొస్తున్నా కేంద్ర ప్రభుత్వం మౌన ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్టు నేను గుర్తించారు. పైగా తరుచూ మాటల గారడీని ఆశ్రయిస్తూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. బుల్డోజర్ల వినియోగం, ఎన్కౌంటర్ హత్యలు, మతపరమైన అంశాలపై 80:20 నిష్పత్తి అంటూ ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు నేతలు బాధ్యతారహితంగా మాట్లాడటం అంతర్జాతీయంగా విమర్శలకు ఆసా రం కలిగించడమే కాకుండా మత సామరస్యానికి, జాతి సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నది. అయినప్పటికీ ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
బాధ్యతారాహిత్యం
అఖిల భారత సేవల (ఏఐఎస్) నిబంధనలను రాష్ట్రాలకు ప్రతికూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిషరించడంలో కేంద్రం మధ్యవర్తిగా మరియు ఫెసిలిటేటర్గా విఫలం కావడం వంటివి సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పడానికి కొన్ని స్పష్టమైన ఉదాహరణలు.
కేంద్ర ప్రభుత్వం సెస్సు రూపంలో పరోక్ష పన్నులు విధించే కుతంత్రం వల్ల పన్ను రాబడిలో న్యాయబద్ధమైన వాటాను రాష్ట్రాలు కోల్పోతున్నాయి రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి ఏకపక్ష, బాధ్యతారహిత విధానాలు దేశాన్ని అభివృద్ధి పథం నుంచి దూరంచేశాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తుకు మంచిది కాదు.
రాష్ర్టాలు అభివృద్ధి చెందినప్పుడే భారత్ ఒక దేశంగా అభివృద్ధి చెందుతుందని నేను పునరుద్ఘాటించగలను. శక్తిమంతమైన, బలమైన ఆర్థిక వ్యవస్థ రాష్ర్టాలు మాత్రమే భారత దేశాన్ని బలమైన దేశంగా మార్చగలవు.
ఈ వాస్తవాల దృష్ట్యా.. ఆగస్టు 7వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. భారతదేశాన్ని శక్తిమంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయత్నంలో రాష్ర్టాలను భాగస్వామ్యం చేయకపోవడంతోపాటు రాష్ర్టాలపై వివక్ష చూపడం వంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి తీవ్ర నిరసనగా నేను గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉంటున్నాను.
ధన్యవాదాలతో..
కే చంద్రశేఖర్రావు
పేలవమైన పాలసీలు
వ్యవసాయం, విద్యుత్తు వంటి క్లిష్టమైన రంగాల్లో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను తీసుకురావడాన్ని బట్టి భారత రాజ్యాంగంలో ప్రముఖంగా పొందుపరుచబడిన సహకార సమాఖ్య స్ఫూర్తిని ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. వ్యవసాయ చట్టాలు, సంస్కరణలుగా పిలుస్తున్న నూతన విద్యుత్తు విధానం వంటివి కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. వ్యవసాయానికి సంబంధించిన చట్టాల్లో జోక్యం చేసుకోవాలన్న అనాలోచిత నిర్ణయాలు, వ్యవసాయోత్పత్తుల సేకరణకు సంబంధించిన సంకుచిత ప్రొక్యూర్మెంట్ పాలసీలు మొత్తం వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు భవిష్యత్తుపై నిరాశను మిగిల్చాయి.
సిఫార్సులకు దిక్కేది?
తెలంగాణలో చెరువుల (మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు) పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు మంజూరుచేయాలని నీతి ఆయోగ్ 2016లో సిఫారసు చేసింది. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేసి, దేశంలోనే అగ్రగామి పథకంగా నిలిచిన మిషన్ భగీరథకు కేంద్రం రూ.19,205 కోట్లు (మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.42,850 కోట్లు) సాయం చేయాలన్నది నీతి ఆయోగ్ చేసిన మరో సిఫారసు.
కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసులను విస్మరించడమే కాకుండా ఈ పథకాలకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి తాగునీరు అందించడం, మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల (చెరువుల) మరమ్మతులు, పునరుద్ధరణ పనులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సొంత నిధులతో చేపట్టి పూర్తి చేసింది. వీటి ప్రయోజనాలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు నాటకీయంగా పెరిగి, వ్యవసాయ రంగానికి నూతనోత్తేజాన్ని అందించడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేసింది. నీతి అయోగ్ సంస్థ నిరుపయోగంగా మారిందని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి.
వాస్తవాలు ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం.. కేంద్ర పథకమైన ‘జల్ జీవన్ మిషన్’ కింద ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తెలంగాణ సాధించిన ఘనత తమదేనంటూ నిర్మొహమాటంగా ప్రకటనలు ఇస్తున్నది.
నేను చెప్పొచ్చే మరో విషయం ఏమిటంటే.. రాష్ట్రాలు తమ అభివృద్ధి అవసరాల కోసం ఎఫ్ఆర్బీఎం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా బహిరంగ మారెట్ నుంచి సేకరించే రుణాలపై ఆధారపడి ఉంటాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు తమ మూలధన అవసరాల కోసం తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగా పరిగణించాలని ఇటీవల స్పష్టం చేసింది.
ఇది అకస్మాత్తుగా తీసుకొన్న నిర్ణయం మాత్రం కాదు. తెలంగాణ, ఇతర అనేక రాష్ట్రాల పురోగతికి బ్రేకులు వేసే ఉద్దేశంతోనే చేశారు. ఎందుకంటే ఈ రుణాలతో చేపట్టిన పనులతో ఆయా రాష్ర్టాల్లో మౌలిక సదుపాయాలు కల్పించబడి, అభివృద్ధి, వృద్ధి ఉపాధి వంటివి సాధ్యమవుతాయి. కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు సేకరిస్తూనే రాష్ర్టాలపై మాత్రం ఇలాంటి వివక్షను ప్రదర్శిస్తున్నది.