CM KCR | కృష్ణా-తుంగభద్ర నదుల మధ్యభాగం నడిగడ్డ శిగమూగింది. ధరణి జోలికి వస్తే రణమేనని తేల్చిచెప్పింది. సోమవారం గద్వాలలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో జనప్రభంజనం కనిపించింది. బీఆర్ఎస్ అధినేత ప్రసంగానికి అదేస్థాయిలో ప్రజలు ప్రతిస్పందించారు. భావోద్వేగానికి లోనయ్యారు. 60 ఏండ్ల పాలనలో పాలమూరు దుర్గతిని, దుస్థితిని వివరించినప్పుడు ఆవేదన చెందారు. 9 ఏండ్ల పాలనలో కష్టాలను ఎలా తీర్చామో చెప్పినప్పుడు దండాలు పెట్టారు. ‘ధరణిని ఉండాల్నా.. తీసేయాల్నా..?’ అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు.. పిడికిళ్లెత్తి మద్దతు పలికారు. ముఖ్యమంత్రికి జైకొడుతూ యువత ఈలలు వేస్తే.. మహిళలు చేతులెత్తి మొక్కారు. తెలంగాణలో విద్యుత్తు వెలుగులు, ఏపీలో కరెంటు కారుచీకట్లను కేసీఆర్ వివరించడం సరిహద్దు జిల్లా గద్వాల ప్రజల్ని ఆలోచింపజేసింది.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రైతులను దళారీల కబంధ హస్తాల నుంచి రక్షించిన ధరణిపై ప్రతిపక్షాలు దుర్మార్గమైన దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పైరవీకారుల వ్యవస్థను సమూలంగా రూపుమాపేందుకు మూడేం డ్లు కష్టపడి ధరణి పోర్టల్ తెచ్చామని చెప్పారు. ధరణిని తీసివేస్తామన్న కాంగ్రెస్ ప్రకటన వెనుక రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకా లు అందకుండా చేసే కుట్ర ఉన్నదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సోమవారం గద్వాలలో నూతన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, బీఆర్ఎస్ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో ఆకలితో తల్లడిల్లిన పాలమూరుకు నాటి పాలకులు ఏంచేశారని ప్రశ్నించారు. తనకన్నా పొడవు, లావు ఉన్న నేతలు గతంలో అధికారంలో ఉన్నారని, మరి నాడు పాలమూ రు కష్టాలు ఎందుకు తీర్చలేదని నిలదీశారు. ఇప్పుడు అధికారమిస్తే ఏదేదో చేసేస్తామని చెప్తే నమ్మేవాళ్లు ఎవరూ లేరని స్పష్టంచేశారు.
రైతులకు రక్షణ ధరణే
‘ఎప్పుడూ పనిచేయనివాళ్లు, ప్రజలకోసం ఆలోచన చేయనివాళ్లు, జమానా మొత్తం కిందమీద చేసినవాళ్లు, దళారీలు మోపై ఈ రోజు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నారు. ధరణివల్ల రైతుబంధు, రైతుబీమా డబ్బులు ఆలస్యం లేకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. రైతులు ధాన్యం అమ్మితే కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ధాన్యం డబ్బులు వెంటనే అన్నదాత బ్యాంకు ఖాతాలో జమవుతున్నాయి. ధరణి ఉంది కాబట్టే పైరవీకారులు, పట్వారీలు, వీఆర్వోల పీడన లేదు. భూమి రిజిస్ట్రేషన్ పది నిముషాల్లో పూర్తవుతున్నది. ఐదు నిముషాల్లో పట్టా చేతికొస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్లు, పట్టాలు వారి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండేవి. వారు రాసిందే రాత, గీసిందే గీత. ఆ దుర్మార్గాలన్నింటికీ ధరణి చెక్ పెట్టింది. అంతగొప్ప ధరణి పోర్టల్ను నేను మూడు సంవత్సరాలు కష్టపడి తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీ దాన్ని బంగాళాఖాతంలో వేస్తామంటున్నది. ఇది ధరణిని వేయడమా, లేక ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా?’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరణి ఉండాలా? తీసేయాలా? అని సభికులను ప్రశ్నించటంతో వేలమంది జనం ఒక్క గొంతుకతో ‘ధరణి ఉండాలి’ అని నినదించారు.
కరువు నేలలో ధాన్యపు రాశులు
కరువు ప్రాంతంగా పేరు పడ్డ పాలమూరు జిల్లాల్లో నేడు ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ‘గతంలోఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు కార్యక్రమానికి నేను హెలికాప్టర్లో కాకుండా పాలమూరు ఎలా మారిందో చూసేందుకు హైదరాబాద్ నుంచి గద్వాలకు రోడ్డు మార్గాన వచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలో నెర్రలు బారిన నేలలతో కనిపించిన పాలమూరులో.. ఆ రోజు నాకు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లే కనిపించాయి. అవి చూసి చాలా ఆనందం కలిగింది. ఈ పచ్చదనం ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పనుల కోసం రోజుల తరబడి నాతో పంచాయితీ పెడతాడు. మరో ఎమ్మెల్యే అబ్రహం సైతం తమకు వంద పడకల దవాఖాన కావాలని కోరారు. ఆర్డీఎస్ పనులు కావచ్చు, గట్టు ఎత్తిపోతల పనులు కావచ్చు, ప్రజలకు అవసరమైన ఇతర పనులు కావచ్చు.. వాటన్నింటి గురించి ఆయన కొట్లాడుతూనే ఉంటారు. ప్రజల కోసం పనిచేసే అలాంటివారికి కాపాడుకోవాలి’ అని ప్రజలకు సూచించారు.
కేసీఆర్ కన్నా ఎత్తు, దొడ్డుగున్నోళ్లు ఏం చేశారు?
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15-20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. రైతుబంధుతోపాటు మరెన్నో కార్యక్రమాలతో రైతులకు మేలు చేస్తున్నం. గతంలో కేసీఆర్కన్నా దొడ్డుగున్నోళ్లు, ఎత్తుగున్నోళ్లు చాలామంది మంత్రులయ్యారు. వాళ్ల పాలనలో గద్వాలలో ఏం అభివృద్ధి జరిగింది.
ఇప్పుడు గద్వాలలో అడ్డం పొడుగు మాట్లాడేవాళ్లు, నాడు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తిచేయలేదు? తెలంగాణ వచ్చేనాటికి అన్ని ప్రాజెక్టులు పెండింగ్లోనే ఎందుకు ఉన్నా యి? మహబూబ్నగర్ పట్టణంలో 14 రోజులకోసారి మంచినీళ్లు దొరికేవి. నాడు మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని వీధుల్లోకి వచ్చి ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నాం. ఏ ఆడబిడ్డ కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకొని బజారుకు పోకుండా చేశాం. ఇలాంటి విధానం భారతదేశంలో మరెక్కడా లేదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి.. ఇలా ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చాం. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు జివితాంతం వర్తించేలా అనేక పథకాలను అమలు చేస్తున్నాం. చరిత్రలో మరెవరూ ఈ విధంగా చేయలేదు’ అని సీఎం వివరించారు.
ఒడ్డు దాటితే ఏపీలో కరెంట్ ఉండదు
తెలంగాణలో నేడు 24 గంటలపాటు కరెంటు ఉంటే.. తుంగభద్రను దాటి అవతలికి పోతే ఏపీలో కరెంటు కష్టాలు కనిపిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. ‘నాడు మనం విడిపోతామంటే.. మీకు కరెంట్ రాదు, తెలంగాణ మొత్తం చీకటైపోతది’ అని ఎంతోమంది శాపనార్థాలు పెట్టారు. కానీ నేడు ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కోతలున్నాయి. తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తుంగభద్ర బ్రిడ్జి ఇవతల తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉంటే.. అవతల ఏపీలో మాత్రం కరెంటు కష్టాలు కనిపిస్తాయి’ అని సీఎం తెలిపారు. ఒకప్పుడు బతకలేక, బతుకులేక మనం వలసపోయామని, నేడు పక్కనున్న కర్నూలు, రాయచూర్ జిల్లాల నుంచే కాకుండా బీహార్, జార్ఖండ్ నుంచి కూడా మన దగ్గరికే వలస వస్తున్నారని తెలిపారు.
‘ఒకప్పుడు గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్ కాలువను మనకు కాకుండా చేసి గద్దల్లా తన్నుకుపోతే.. తెలంగాణ ఉద్యమంలో జోగులాంబ తల్లికి దండం పెట్టి నా మొట్టమొదటి పాదయాత్రను జోగుళాంబ నుంచి గద్వాల వరకు చేపట్టిన. నాడు అలంపూర్, గద్వాల, నడిగడ్డతోపాటు అనేక చోట్ల కనిపించిన హృదయ విదారక దృష్యాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు టీఆర్ఎస్ కొత్త పార్టీ అయినప్పటికీ తేలువీధిలో సభ పెడితే ప్రళయ గర్జన వలె జనం తరలివచ్చారు. ఆ ఉద్యమ పుణ్యమా అని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొన్నం. సొంత రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల చేపట్టి గద్వాల జిల్లాను ఏర్పాటుచేశాం. రాజ భవనాలను తలపించేలా కొత్త కలెక్టరేట్, పోలీస్ భవనాలను నిర్మించాం’ అని వివరించారు.
ప్రతి ఊరికి పది లక్షలు
గద్వాల జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 12 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలున్నాయని, ప్రతి గ్రామానికి రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక గ్రాంటు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మండల కేంద్రాలను అభివృద్ధికి ఒక్కో మండలానికి రూ.15 లక్షలు, గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని, అలంపూర్లో ఆర్డీఎస్ కొనసాగింపునకు సంబంధించిన మామిడికుంట, మల్లమ్మకుంట ప్రాజెక్టులను వీలైనంత త్వరలో పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఉద్యమకారులతో జిల్లాకు ఊతం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. నిరంజన్రెడ్డి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయగా, శ్రీనివాస్గౌడ్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యమం చేశారని తెలిపారు. ఇద్దరు ఉద్యమకారులు జిల్లాకు మంత్రులుగా ఉండటం, మరో ఉద్యమకారుడు లక్ష్మారెడ్డితోపాటు ఉద్యమకారులైన ఎమ్మెల్యేలు ఉండటం ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరమని పేర్కొన్నారు. నాడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేని జిల్లాలో నేడు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు.