హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్వో కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డిని ఆదేశించారు. మృతుని కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శ్రీనివాసరావు రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు ఆయన కుటుంబసభ్యులకు పూర్తిస్థాయి జీతభత్యాలు అందజేయాలని, కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ను ఆదేశించారు.
శ్రీనివాసరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని, అంత్యక్రియల్లో పాల్గొనాలని మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు ఎక్స్గ్రేషియా, రిటైర్మెంట్ వయసు వరకు జీతభత్యాలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు ఇంటిస్థలం కూడా కేటాయిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే అన్ని మెడికల్ సౌకర్యాలు కల్పించడంతోపాటు ఇంటి అద్దె కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వోద్యోగులకు అండగా ప్రభుత్వం
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి జంకు లేకుండా తమ విధులను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.