హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. సమావేశంలో కీలక విషయాలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం స్పష్టం చేయగా.. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టం చేసింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని, ఈ మేరకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. అయినా ధాన్యం సేకరణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నానా యాగీ చేస్తున్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో ధాన్యం సేకరణపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.