హైదరాబాద్ : వ్యవసాయ చట్టాలను పాటు విద్యుత్ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి ఫ్రీగా ఇస్తున్నం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతు లోకం చాలా నలిగిపోయింది.. నష్టపోయింది.. కష్టపడ్డది కాబట్టి వారిని ఆర్థికంగా స్థితిమంతులను చేయడం కోసం, తెలంగాణ రైతాంగాన్ని ఆత్మవిశ్వాసంతో బతికేటట్టు తయారు చేయడం కోసం అనేక చర్యలు చేపట్టినం. ఆ చర్యల్లో భాగంగా నాణ్యమైన 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నం. కానీ, మీరో నూతన విద్యుత్ చట్టం తెచ్చి రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నరు.
ప్రతి బోరు వద్ద, ప్రతి దాని వద్ద మీటరు పెట్టండని చెబుతున్నరు. మాకు కెపాసిటీ ఉన్నది.. మా రైతులకు ఉచితంగా సరఫరా చేసుకుంటమని చెబుతున్నం. ఏ రాష్ట్రాలు ఇట్ల ఇస్తయో ఆ రాష్ట్రాలను అనవసరంగా ఒత్తిడికి గురి చేయొద్దని డిమాండ్ చేస్తున్నం. మీరు తెచ్చిన విద్యుత్ చట్టం మీద ఈ రోజు విద్యుత్ కార్మికులు, ప్రజలు ఆందోళనతో ఉన్నరు. మరీ ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం చాలా ఆందోళనతో ఉన్నది. మేం మీటర్లు పెట్టేందుకు సిద్ధంగా లేం. మీరేమో పెట్టాలని ఒత్తిడి తెస్తున్నరు. రాష్ట్రాలు మీ చట్టం అమలు చేయమని మా మీద భయంకరమైన ఒత్తిడి తెస్తున్నరు. మాకొచ్చే నిధులు నిలిపేస్తమని ఇంకో రకమైన పద్ధతిని అవలంభిస్తున్నరు ఇది కరెక్టు కాదు. ఇది నియంతృత్వ వైఖరి అయిది.. ఇది ప్రజాస్వామ్య దేశం. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని హక్కులు, బాధ్యలున్నయ్.
కాబట్టి రాష్ట్రాలపై రుద్దొద్దు ఎట్టి పరిస్థితుల్లో. మీ పాలసీ మంచిదని, ఒక వేళ మీ పార్టీ అధికారంలో ఉన్నకాడ అమలు చేసుకుంటమంటే చేసుకోండి. అందరిపై రుద్దేలా కఠినతరమైన చట్టాన్ని తెచ్చి, మెడమీద కత్తిపెట్టే ప్రయత్నం చేయొద్దని, ఆ విద్యుత్ చట్టాన్ని కూడా వెంటనే వాపస్ తీసుకోవాలని ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నం. ఆ విద్యుత్ చట్టం పాస్ ఇంకా కాలేదు. పాసైతే చాలా తీవ్రమైన ఆందోళన దేశవ్యాప్తంగా చెలరేగుతుంది. మళ్లీ ఒకసారి రైతులంతా బజారునపడుతరు. ఇది గ్యారంటీగా జరుగుతుది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు, ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నరు.
ఇది రైతాంగానికి భరోసాగా ఉన్నది. ఆ రైతుల నోట్లో మట్టిగొడుతం. మీరు మీటర్లు పెట్టాల్సిందే అని జబర్దస్త్ పద్ధతిలో విద్యుత్ చట్టం ఉంది కాబట్టి వెంటనే విద్యుత్ చట్టాన్ని విత్డ్రా చేసుకోండి. ఇది ఎంత వరకు సమంజసం కాదు. బాయిలకాడ మీటర్లు పెట్టండి. బోర్లకాడ మీటర్లు పెట్టం అనేది దుర్మార్గమైన చర్య.. అది కూడా వ్యవసాయ వ్యతిరేక చర్య. ఆ చట్టాన్ని కూడా వ్యవసాయ చట్టాలతో విద్యుత్ చట్టాన్ని పాస్ చేయకుండా వాపస్ తీసుకోవాలి. తాము టీఆర్ఎస్ నుంచి చట్టాన్ని వ్యతిరేకిస్తాం. లోక్సభలో, రాజ్యసభలో మాకున్న శక్తిమేరకు పోరాడుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.