వరంగల్/నల్లగొండ, నవంబర్14(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇబ్రహీంపట్నం: తొర్రూరులో ఇసుకేస్తే రాలనంత జనం.. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాల ప్రభంజనం.. రోడ్లపై పరుచుకున్న గులాబీవనం.. ఇదీ పాలకుర్తి నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు ప్రజలు పోటెత్తిన వైనం.. తొర్రూరులోని మహబూబాబాద్ రోడ్డులో 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన ఈ సభకు వచ్చిన జనంతో సభాప్రాంగణంతోపాటు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి మొత్తం కిలోమీటర్లకొద్దీ ప్రజలతో నిండిపోయింది. వేలాది ట్రాక్టర్లలో రైతులు ఈ సభకు తరలివచ్చారు. తండోపతండాలుగా జనం తరలివస్తుంటే రోడ్లన్నీ చీమలదండును తలపించింది.
భారీ సంఖ్యలో వచ్చిన జనంతో తొర్రూరు పట్టణం, శివారు ప్రాంతాలు కిటకిటలాడాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో పరిసర ప్రాంతాలన్నీ మార్మోగాయి. బీఆర్ఎస్ శ్రేణుల ఈలలు, కేరింతలతో పట్టణం దద్దరిల్లింది. హుషారెత్తించే పాటలతో పోటెత్తే దరువులతో ప్రజలు నృత్యాలు చేసూ ఊర్రూతలూగారు. సభలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ వివరిస్తున్నప్పుడు జనం ఈలలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. యాంకర్, కళాకారుడు బిత్తిరి సత్తి, ఇతర కళాకారులు పాటలతో జనంలో మరింత జోష్ నింపారు.
గులాబీ జెండలే రామక పాట అందరిలో ఊపు తెచ్చింది. తొర్రూరుతోపాటు నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్గేటు వద్ద మంగళవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద బహిరంగసభలు విజయవంతమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎర్రబెల్లి దయాకర్రావు, నోముల భగత్కుమార్, మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆయా సభలకు ఆటోలు, ట్రాలీలు, మోటరు సైకిళ్లపై ఊరూరా జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. మొత్తంగా సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజాఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు.
ఇండ్లకు తాళాలేసి తరలొచ్చిన తండాలు
నల్లగొండ జిల్లా హాలియా పట్టణం ప్రజాఆశీర్వాద సభ సందర్భంగా జనసాగరాన్ని తలపించింది. ఎటుచూసినా గులాబీ సైన్యం బారులుదీరి కనిపించింది. నిడమనూరు, పెద్దవూర, సాగర్ నుంచి హాలియా వరకు ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. కేసీఆర్ పట్ల కృతజ్ఞతతో గిరిజన తండాలన్నీ ఇండ్లకు తాళాలు వేసి సభకు కదలొచ్చాయి. రైతులంతా స్వచ్ఛందంగా సొంత ట్రాక్టర్లలో వచ్చారు. కళాకారుడు ఏపూరి సోమన్న కళాబృందం ప్రదర్శించిన ఆటపాటలకు జనం స్టెప్పులేస్తూ గొంతు కలపడంతో సభా ప్రాంగణమంతా హోరెత్తింది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధిపై వివరించేటప్పుడు, విపక్షాల తీరును ఎత్తి చూపినప్పుడు, సాగర్ సమస్యలను ప్రస్తావించినప్పుడు సభా ప్రాంగణం పలుమార్లు చప్పట్లతో మార్మోగింది. ఏడెనిమిది నెలల్లో నెల్లికల్లు లిఫ్టును తానే వచ్చి ప్రారంభిస్తానని చెప్పగా గిరిజనులంతా ఈలలు, కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. రెండేండ్లలో ఉచిత కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొంటానన్న జానారెడ్డి.. ఆ తర్వాత మాట తప్పాడని, పైగా భగత్పై ఉప ఎన్నికల్లో పోటీకి దిగాడని గుర్తు చేసినప్పుడు సభ ప్రాంగణం అరుపులతో దద్దరిల్లింది.
ఖానాపూర్గేట్కు పోటెత్తిన జనం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖానాపూర్గేట్ వద్ద జరిగిన ప్రజాఆశీర్వాదసభకు భారీ ఎత్తున ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. నియోజకవర్గంలోని అన్ని ఊళ్ల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువమంది వచ్చారు. సెంటిమెంట్ ప్రకారం ఎమ్మెల్యే కిషన్రెడ్డి గత ఎన్నికల ముందు కూడా ఇక్కడే బహిరంగసభ ఏర్పాటుచేసి సీఎం కేసీఆర్ను తీసుకువచ్చారు. ఈసారి కూడా అదే సెంటిమెంట్తో ఖానాపూర్గేటు వద్ద సభను ఏర్పాటుచేశారు. సీఎం ప్రసంగిస్తున్నంత సేపు జనహోరు మార్మోగింది. కేసీఆర్ మాటమాటకు చప్పట్లు, ఈలలు, కేరింతలు ప్రతిధ్వనించాయి. పథకాలు వల్లెవేసినప్పుడు చేతులెత్తి మద్దతు పలికారు.