CM KCR | నిజామాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆయన లక్ష్మీపుత్రుడు కాబట్టే.. బాన్సువాడ.. బంగారు వాడలా తయారైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎక్కడ అడుగుపెట్టినా లక్ష్మీ తాండవించేది.. ఏ పని మొదలుపెట్టినా బ్రహ్మాండంగా శుభప్రదం అయ్యేది అని కేసీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు, ఎరువులు తేవడం, ఢిల్లీలో వారం వారం రోజులు కూర్చొని కొట్లాడి రాష్ట్రానికి ఎరువులు తెచ్చేవారు. అందుకే ఆయనకు లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా.. ఆయన నిజంగానే లక్ష్మీపుత్రడు కాబట్టి.. ఇవాళ బాన్సువాడ గడ్డ మీద నుంచి గర్వంగా చెబుతున్నా.. బాన్సువాడ కాదు బంగారు వాడలా తయారైంది అని కేసీఆర్ తెలిపారు.
ఈ సభను చూస్తుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష మెజార్టీతో గెలుస్తారనే విశ్వాసం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. పోచారం పెద్ద హోదాలో ఉంటారని హామీ ఇస్తున్నా. అది గ్యారెంటీ కాబట్టి.. మీరు గెలిపిస్తరు గ్యారెంటీ.. పెద్ద హోదా వస్తది అది కూడా గ్యారెంటీ. ఆ తర్వాత బాన్సువాడకు అన్ని పనులు జరిగిపోతాయి ఇబ్బంది లేదు. తెలంగాణకు కులం, మతం లేదు. అందరం కలిసి బతికే ప్రాంతం అని కేసీఆర్ అన్నారు.