CM KCR | పరకాల : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉత్తమమైన మనిషి.. ప్రజల ఫీలింగ్ ఉన్న మనిషి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదలో కేసీఆర్ పాల్గొని చల్లా ధర్మారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
ధర్మారెడ్డి ఉత్తమమైన మనిషి, ప్రజల ఫీలింగ్ ఉన్న మనిషి. ఆయన ఎవరి తెరుగు పోయేటోడు కాదు. నియోజకవర్గం పనే అడిగే వ్యక్తి. వ్యక్తిగత పనులు అడగలేదు. చలివాగు ప్రాజెక్టు కావొచ్చు, కాలువలు కావొచ్చు. దేవాదుల నీళ్ల విషయం కావొచ్చు. ఎస్సారెస్సీ నీళ్ల విషయం కావొచ్చు. ఇవే నాతో మాట్లాడిండు తప్ప వ్యక్తిగత పనులు అడగలేదు. ఇలాంటి మంచి అభ్యర్థిని గెలిపిస్తే రైతుబంధు 16 వేలు అయితది.. 24 గంటల కరెంట్ ఉంటది.. అన్ని విధాలా పరకాల అభివృద్ధి జరుగుతది. పరాకల అభివృద్ధి విషయంలో ఏం కావాలంటే అది చేసి పెట్టే బాధ్యత నాది. వేరోడు వస్తే మళ్లీ ఆగమాగం అవుతది. పాలిచ్చే బర్రెను అమ్ముకొని దున్నపోతును తెచ్చుకున్నట్లు అవుతది. లేనిది మెడకు తుండ కట్టుకున్నట్టు అవుతది. ఏది సమంజసం..? ఏది న్యాయం..? ఏ వైపు పోతే మంచిదని ఆలోచించాలి. మీ భవిష్యత్ మీ చేతుల్లో ఉంటది కాబట్టి నిర్ణయం చేస్తే మంచిది అని కేసీఆర్ సూచించారు.
గతంలో తండాలను పంచాయతీలు చేసిండ్రా..? ఎన్నేండ్లు కొట్లాడినా చేయలేదు. చివరకు బీఆర్ఎస్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. మీరు మంచి వస్త్ర పరిశ్రమ తీసుకొచ్చారు.. కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు ఇక్కడకు రావడం చాలా సంతోషం. చాలా మంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ధర్మారెడ్డి చెబుతుండ్రు. నిజంగా చాలా లాభం జరుగుతది. పరకాలకు ఏదో కోర్టు అడిషనల్గా అవసరం ఉంది. మీరు అనుకుంటే అయ్యే పని అంటున్నడు. అదే అయ్యే పని అయితే పరకాలలో పెట్టిస్తా తప్పకుండా. న్యాయవాద మిత్రులకు మనవి చేస్తున్నా. హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడి కోర్టు తెప్పించే ప్రయత్నం చేస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు.