హైదరాబాద్ : ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ భూదాన్ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించడం అభినందనీయమన్నారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని సీఎం తెలిపారు.
భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 24వ సెషన్లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి అవార్డును ప్రదానం చేయనున్నారు. భూదానోద్యమంతో పోచంపల్లికి భూదాన్ పోచంపల్లిగా మారింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంపల్లి పేరు సంపాదించింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.