హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కృషి అజరామరమైనదని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని సందర్భంగా బుధవారం ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో భావజాల వ్యాప్తికోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలనా స్వాప్నికుడని పేర్కొన్నారు. జయశంకర్ ఆకాంక్షించిన మహోజ్వల తెలంగాణను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమాజం ఆవిషరించుకుంటున్నదని, ఇది గర్వించదగ్గ విషయమని పేరొన్నారు. ఇటువంటి చారిత్రక సందర్భంలో ఆయన ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారని, నేడు ఆయన లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ అమరుల స్ఫూర్తితో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రభుత్వం ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సీఎం అన్నారు.
ఫ్రొపెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. పంటల దిగుబడిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, నేడు యావత్ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని, ఏ రంగంలో చూసినా రోల్ మోడల్గా మారిందని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని బంగారు మైసమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గుత్తా పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో శాసనమండలి విప్లు ఎంఎస్ ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గోసను తనదైన యాసతో కైగట్టి పాటలల్లిన కవి గూడ అంజయ్య ఉద్యమ సమయంలో ప్రజల్లో స్ఫూర్తిని రగిలించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గూడ అంజయ్య వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు గూడ అంజయ్య గేయాలు, సాహిత్యం ప్రతీకలుగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం అనేక పాటల ద్వారా అంజయ్య చేసిన సాంసృతిక భావజాలవ్యాప్తి ప్రజలను కార్యరంగంలోకి దూకేలా చేసిందని పేర్కొన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని వైద్య ఆరోగ్యరంగ దుస్థితిని కళ్లారా చూపుతూ అంజయ్య ‘నేను రాను బిడ్డో సరారు దవాఖానకు’ అనే పాట రాశారని, ఆ పాటకు నేటి తొమ్మిదేండ్ల ప్రగతి సమాధానంగా నిలిచిందని తెలిపారు. అమరుల ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ, అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తూ, నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను రాష్ట్రంతో పాటుగా దేశ విదేశాల్లో తెలిసే విధంగా చెప్పిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ దక్కుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. జయశంకర్ కలలుకన్న తెలంగాణను సీఎం కేసీఆర్ సాధించారని, తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు సాకారం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, మాజీ ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.