హైదరాబాద్ : హక్కుల సాధన కోసం ముందు ప్రార్థించడం, అభ్యర్థించడం, ఆ తర్వాత నిరసన ప్రకటించి ఉద్యమించడం అనే ప్రజాస్వామిక పంథా ద్వారా, దేశ ప్రజలను దేశ స్వాతంత్రోద్యమంలో లక్ష్య సాధన దిశగా కార్యోన్ముఖులను చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ, అన్ని కాలాలకూ ఆదర్శనీయమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు.
గాంధీజీ జాతికి అందించిన స్ఫూర్తిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అహింసా, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపడం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని సీఎం తెలిపారు. గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు మహాత్మా గాంధీ అని సీఎం పేర్కొన్నారు.
గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సత్యమేవ జయతే.. సూక్తిని అనుసరిస్తూ అంతిమ విజయం సత్యానిదే అని చాటి చెప్పిన మహాత్మాగాంధీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. ‘గుంపులో ఒకరిగా ఉండడం తేలికే కానీ.. ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలి’ అన్న మహాత్మా గాంధీ మాటలే ప్రేరణగా తెలంగాణ రాష్ట్రం హక్కుల సాధనకోసం ముందడుగు వేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.