హైదరాబాద్ : దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా ఆమెకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారణిగా ఆమె సాగించిన పోరాటాన్ని సీఎం స్మరించుకున్నారు. స్త్రీకి స్వేచ్ఛ కరువైన నాటి కాలంలో ఒక దళిత మహిళగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తీరు నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
తెలంగాణ గర్వించే బిడ్డగా ఈశ్వరీబాయి అనుసరించిన విలువలు, స్ఫూర్తి రేపటి తరానికి అందించాలనే లక్ష్యంతో గత పాలనలో విస్మరించబడిన ఈశ్వరీబాయి జయంతిని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. ఈశ్వరీబాయి వంటి ప్రజాస్వామిక వాదుల ఆశయాల ప్రేరణతో, తెలంగాణ ప్రభుత్వం దళిత సాధికారతను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని చెప్పారు. ఈశ్వరీబాయి వంటి దళిత ప్రజాస్వామిక వాదుల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.
దళితుల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా, వారిలో ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దళితులు, బహుజనులు, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను కొనసాగించాలనే స్పృహను యావత్ దేశంలోని పాలక వ్యవస్థకు కలిగించేందుకే తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. 125 అడుగులతో, దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం తెలిపారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం దేశానికి ప్రేరణగా నిలుస్తున్నదన్నారు.