హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి ఆమెకు నివాళులర్పించారు. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారిణిగా ఆమె సాగించిన సాహస పోరాటాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకొన్నారు. స్త్రీకి స్వేచ్ఛ కరువైన నాటి కాలంలో ఈశ్వరీబాయి ఒక దళిత మహిళగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తీరు నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గత పాలనలో విస్మరించిన ఈశ్వరీబాయి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
ఈశ్వరీబాయి వంటి ప్రజాస్వామిక వాదుల ఆశయాల ప్రేరణతో దళిత సాధికారతను సాధించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దళితుల ఆర్థిక సామాజిక ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసేలా, వారిలో ఆత్మైస్థెర్యం నింపేలా ‘దళితబంధు’ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. దళిత బహుజన మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను కొనసాగించాలనే సృ్పహను యావత్తు దేశంలోని పాలక వ్యవస్థకు కలిగించేందుకే సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టామని చెప్పారు. అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ప్రేరణగా నిలుస్తున్నదని సీఎం పేర్కొన్నారు.