హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/ బంజారాహిల్స్: అనారోగ్యంతో మృతిచెందిన మాజీ మంత్రి కే విజయరామారావు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుష్పాంజలి ఘటించారు. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నం 3లోని కేవీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయరామారావు భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ, కొడుకు శ్రీనివాస కళ్యాణ్లను ఓదార్చారు. ఇంటిపెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ధైర్యం చెప్పారు. అధికారికంగా జరుగుతున్న అంత్యక్రియల ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కడియం శ్రీహరి, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ నేతలు శ్రవణ్కుమార్రెడ్డి, నారదాసు, డీజీపీ అంజనీకుమార్, కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు విజయరామారావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.