హైదరాబాద్ : అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలొదిలి అమరులైన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం వదిలిన వీరి స్ఫూర్తి మనకు ఆదర్శం అని సీఎం అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం ఇచ్చారు.
అనాది కాలం నుంచి మనుషులు, అడవులది విడదీయరాని బంధం. ప్రకృతి, పర్యావరణం తోడుగానే మనిషి ఎదుగుదల సాధ్యమైంది. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్ల నుంచి అడవుల రక్షణ, పచ్చదనం పెంపునకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. తెలంగాణకు హరితహారం ద్వారా జంగల్ బచావో – జంగల్ బడావో నినాదం తీసుకుని పని చేస్తున్నాం. ఉన్న అటవీ సందపను కాపాడుకుంటూనే, కొత్తగా పచ్చదనం పెంచడం ద్వారా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మలచాలనే తలంపుతో ముందుకు సాగుతున్నాం.
రానున్న తరాలకు ఆకు పచ్చని పరిసరాలను కానుకగా అందించాలను ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగుతోంది. గత ఏడేళ్లుగా ఈ దిశగా జరిగిన ప్రయత్నాలు, సాధించిన విజయాలు మీకందరికీ తెలుసు.
అత్యంత ప్రాధాన్యమైన అటవీ సంరక్షణ విధుల్లో అటవీ సిబ్బంది అత్యంత ధైర్య సాహసాలతో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ధన్యజీవులను పేరుపేరునా మనం స్మరించుకోవాలి.
అటవీ అమరవీరుల సంస్మరణ దినం ( సెప్టెంబర్ 11, 2021) సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలొదిలి అమరులైన వారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం వదిలిన వీరి స్ఫూర్తి మనకు ఆదర్శం. మన మనుగడకు ఆధారమైన అడవులు, ప్రకృతి, పర్యావరణం కాపాడేందుకు ఈ సందర్భంగా మనం అందరమూ మరోసారి పునరంకితం అవుదాం.